బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి, నేనూ పార్టీ మారతానా?: హరీశ్ రావు తీవ్ర విమర్శలు
హైదరాబాద్: బీజేపీ నేతల్లో రోజురోజుకూ ఫ్రస్టేషన్ పెరిగిపోతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
బీజేపీ ధర్నా ఓ డ్రామా..
ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బీజేపీ ధర్నాను డ్రామాగా అభివర్ణించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ తరపున 12 మంది కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానిని కూడా తీసుకొచ్చారని హరీవు రావు అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా ఎన్నికల ప్రచారం ఉండాలని, కానీ, బీజేపీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి..
సోషల్ మీడియాను ఫేక్ మీడియాగా బీజేపీ మార్చిందని, దాన్ని నడపడంలో ఆ పార్టీకి నోబెల్ బహుమతి వస్తుందని హరీవు రావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
తాను కూడా పార్టీ మారతానంటూ తప్పుడు ప్రచారం
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఓ ఛానల్ లోగోతో వీడియో సృష్టించారని, ఇప్పుడు తనతోపాటు టీఆర్ఎస్ కీలక నేతలు పార్టీ మారుతున్నట్లు ప్రముఖ ఛానళ్ల నకిలీ లోగోలతో వీడియో తయారు చేయించారని హరీశ్ రావు ఆరోపించారు. కాగా, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎస్ఈసీ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరీశ్ రావు ఆరోపణలు చేశారు.
Recommended Video
టీఆర్ఎస్, ఎంఐఎం డబ్బులు పంచుతున్నాయి.. : రాజా సింగ్
ఇది ఇలావుండగా, ఓట్ల కోసం గత రాత్రి నుంచి టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బహిరంగంగా పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, పైగా వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపైనే లాఠీ ఛార్జీ చేస్తున్నారని, మైలార్ దేవ్ పల్లితోపాటు పలు డివిజన్లలో ఇలాంటి దాడులు జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని ఆరోపించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని రాజాసింగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు.