పడగొట్టేందుకే, ఈ విషయంలో చంద్రబాబు ఎవరివైపు: ఇరకాటంలో పడేసిన హరీష్
అమరావతి: మహాకూటమి ఓ అతుకుల బొంత అని టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు మండిపడ్డారు. తెలంగాణను దోచుకోవడానికే మహాకూటమి పుట్టిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసమే మహా కూటమి ఏర్పడిందని ఆరోపించారు.
నదీ జలాలు, ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో చంద్రబాబు ఎవరి పక్షాన నిలబడతారో చెప్పాలని సవాల్ చేశారు. ఏపీ పక్షాన నిలబడతారా, తెలంగాణ పక్షాన నిలబడతారా అని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ నిరోధకులుగానే మహాకూటమి పని చేస్తోందన్నారు. రాదనుకున్న తెలంగాణను తెచ్చింది తెరాస పార్టీ అన్నారు.
అందుకే టీడీపీతో పొత్తు, కేసీఆర్! టీడీపీపై అప్పుడు గుర్తుకు లేదా: రేవంత్ రెడ్డి
తెలంగాణను పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు
వచ్చిన తెలంగాణను నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. తెలంగాణను పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ జతకడుతోందని, ఇక ఏమనాలని విమర్శించారు. ప్రజలు మహా కూటమికి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు.
సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేక
టీఆర్ఎస్ పార్టీ పైన సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేక కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని హరీష్ రావు అన్నారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని చెప్పారు. ఇక బోర్లు, బావులు ఎండిపోవడం వంటివి ఉండవని చెప్పారు. చెరువులు నిరంతరం జలసిరితో కలకలలాడుతాయని చెప్పారు.
చంద్రబాబు కుతంత్రాలు
కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు కుతంత్రాలకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ కలవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మందపల్లి చుట్టుపక్కన ఇండస్ట్రియల్ పార్క్, రైల్వే స్టేషన్ వస్తున్నాయని చెప్పారు.
హరీష్ రావుకు ఓటేస్తామని తీర్మానం
వలసలు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ కావడమే టీఆర్ఎస్ అజెండా అని హరీష్ రావు అన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. ఈ 60 రోజులు అందరూ పట్టుదలతో పని చేయాలని, రాబోయే ఐదేళ్లు మీకోసం పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఆగిపోతుందన్నారు. తెరాసకు పోటీగా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, మహాకూటమికి ఒక జెండా, అజెండా లేదన్నారు. మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్ది ఓర్వలేనితనమన్నారు. కాగా, మందపల్లిలో నిర్వహించిన ఏకగ్రీవ తీర్మాన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. హరీశ్ రావు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి, తీర్మాన పత్రాలను అన్ని కుల సంఘాలు ఆయనకు అందించాయి.