చరిత్ర తిరగరాస్తాం! అలాంటి బాబుతో పొత్తా?: హరీశ్, టీఆర్ఎస్లోకి కొడంగల్ కాంగ్రెస్ నేతలు, రేవంత్..
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ జెండా మరోసారి ఎగరడం ఖాయమని ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన గొల్లకురుమ సంఘం ప్రతినిధులు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజారిటితో గెలిపించాలని హరీశ్ కోరారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలన్నారు.
ఈ ఆనందంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది: హరీశ్ భావోద్వేగం, ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్ ప్రభుత్వమే రావాలి..
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలో రావాలన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కేసులు వేశారని విమర్శించారు.
వాళ్లు చేయరు.. చేసేవాళ్లకు అడ్డుపడతరు..
ప్రాజెక్టు నిర్మాణంతో పెద్ద పులుల ఆవాసం దెబ్బతింటుందని, అడవులు ధ్వంసమవుతాయని అసత్యాలు చెబుతూ ఢిల్లీలో కేసులు వేశారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కాంగ్రెస్ నేతలకు పట్టడంలేదన్నారు. ప్రజలకు తాగునీరు లేకపోయినా, వ్యవసాయం లాభసాటిలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు చేయరు.. చేసేవాళ్లకు అడ్డుపడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.
తప్పుడు సమాచారం, దొంగ సంతకాలు
పాలమూరు ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేసినప్పడు నిజంగానే అక్కడ పెద్ద పులులు ఉన్నాయా? అడవులు దెబ్బతింటాయా? అని మంత్రి జూపల్లిని అడిగితే.. అక్కడ పులులు కాదు కదా.. గండుపిల్లులు కూడా లేవన్నారు. అడవులు కాదు ఆముదపు చెట్టు కూడా లేవని తనతో అన్నట్టు చెప్పారు. తప్పుడు సమాచారం, దొంగ సంతకాలతో కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అలాంటి చంద్రబాబుతో పొత్తులా.?
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని హరీశ్ విమర్శించారు. మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
చరిత్ర తిరగరాస్తాం
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లతో అధికారంలోకి వచ్చి చరిత్రను తిరగరాయబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. కొడంగల్ అభివృద్ధి కావాలంటే గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. కర్ణాటక మంత్రి రేవన్న వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారని, గొళ్లకురుమల అభివృద్ధి కోసం బాగా చేస్తున్నావని కేసీఆర్ను మంత్రి రేవన్న ప్రశంసించారని హరీశ్ తెలిపారు.