ఇదీ హరీష్ రావు: నిశిరాత్రి, తెల్లవారు జామున 3 గంటల దాకా...
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పట్టుబడితే వదలరనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రిపూట ఆయన అలుపెరుగని యాత్ర సాగించారు. సుందిళ్ల బ్యారేజీలో తెల్లవార జాము 3 గంటల వరకు పర్యటించారు. కాళేశ్వరం పనులను తనిఖీ చేశారు
నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు కాళేశ్వరంలోనే మకాం వేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో అధికార యంత్రాంగం, ఏజెన్సీలను సన్నద్ధం చేయడానికి మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనే మకాం వేయాలని నిర్ణయించుకున్నారు.
హరీష్ రావు సుడిగాలి పర్యటన
తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలకు పేరుపొందిన హరీశ్ రావు మరో సంచలనాన్ని నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయన నిరవధిక యాత్ర సాగింది.సుందిళ్ళ బ్యారేజీ సైటులోనే హరీశ్ రావు బస చేశారు
మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన తీరు అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది.
రాత్రికి అక్కడికి చేరుకుని..
సోమవారం సాయంత్రం వరకు సిద్ధిపేటలో పలు కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపిన మంత్రి రాత్రికి కాళేశ్వరం ప్యాకేజి 6,7 లను సందర్శించారు. అనంతరం అటవీ ప్రాంతంలోని సుందిళ్ళ బ్యారేజీ పనులను తనిఖీ చేశారు.నిర్ణీత కాల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను హరీశ్ రావు కోరారు. ఇరిగేషన్ అధికారులు,ప్రజాప్రతినిధులు, మీడియాకు తెలియకుండా, మంది మార్బలం లేకుండా హుటాహుటిన ఈ ప్యాకేజి లలోని సొరంగాల నిర్మాణ పనుల పురోగతి, పంపు హౌస్ పనులను పరిశీలించారు.
హరీష్ రావుపై కేసిఆర్ ఇలా..
మంత్రి హరీష్పై తెలంగాణ ప్రజలుకోటి ఆశలు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించిన కొద్ది రోజులకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయడానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారు.సుందిళ్ళ బ్యారేజీ పనులలో రోజుకు 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు.
చరిత్రలోనే ఇది తొలిసారి
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కాంక్రీటు పనులకు రోజుకు 2 లక్షల సిమెంట్ బస్తాలు వాడడం దేశ చరిత్రలో ప్రప్రథమమని హరీశ్ రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్పై ఎంతో ఆశలు నమ్మకంతో ఉన్నారని ముఖ్యమంత్రి ఇటీవల అన్నారు. ఇకపై మంత్రి హరీష్ రావు 10 రోజులకు ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శించాలని కేసీఆర్ కోరారు.
తెలంగాణలోని 15 జిల్లాలకు..
తెలంగాణలోని 15 జిల్లాలకు తాగు, సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో వచ్చే జూన్ కల్లా కాళేశ్వరం నుంచి పంపులు నడిపించాలని మంత్రి హరీష్ రావు కృత నిశ్చయంతో ఉన్నారు.రాష్ట్ర సాగునీటిరంగ ముఖచిత్రంలో 'కాళేశ్వరం ఎత్తిపోతల పథకం' విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తుందని భావిస్తున్నారు.