మా ప్రాజెక్టులకు అడ్డుపడితే చూస్తూ ఊరుకోం: చంద్రబాబుకు హరీశ్ హెచ్చరిక
జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో మంత్రి హరీశ్ పర్యటించారు.
ఈ సందర్భంగా కొత్లాపూర్ మండలం కలికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో హరీశ్ రావు ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా త్వరలోనే కోనసీమను తలపిస్తుందని అన్నారు. వచ్చే దసర పండుగ నాటికి సూరమ్మ చెరువులో నీటిని నింపుతామని, ఇందుకు 300 ఎకరాల భూమి ఇస్తే సూరమ్మ చెరువులో నీటిని నింపే బాధ్యత తనదేనని అన్నారు.
ఆ ఘనత కేసీఆర్దే
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రారంభించి చుక్క నీరు కూడా నింపలేదని హరీశ్ విమర్శించారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో 5టీఎంసీలు, 2015లో 10టీఎంసీలు, 2016లో 20టీఎంసీలు నింపామన్నారు. ఎల్లంపల్లి కింద రైతులకు నీరిచ్చిన ఘనత కేసీఆర్దే అని హరీశ్ తెలిపారు.
అడ్డంపడుతున్నారంటూ బాబుపై ఫైర్
తెలంగాణ ప్రజల కోసం తాము ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్, చంద్రబాబు అడ్డం పడుతున్నారని మంత్రి హరీశ్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ కేసులతో, మరోవైపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఫిర్యాదులతో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
చూస్తూ ఊరుకోమంటూ బాబుకు హెచ్చిరక
పోలవరంపై ఒడిషా ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిందని.. పోలవరం కట్టడం ఆపుతావా? అంటూ చంద్రబాబును హరీశ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
ప్రాజెక్టును ఆపడం ఎవరి తరం కాదు
తెలంగాణకు 954 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని శ్రీకృష్ణ కమిటీ ముందు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తెలిపిందని, ఈ వాటా నీటి కోసమే కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నట్లు మంత్రి చెప్పారు. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నాయకత్వంలో కట్టి తీరుతామని, ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరి తరం కాదని మంత్రి హరీశ్రావు తేల్చి చెప్పారు.