ఏపీకి రాహుల్ గాంధీ హామీ తెలంగాణకు నష్టం: హరీష్ రివర్స్ అటాక్, బాబు వచ్చినా గెలుస్తా.. తలసాని
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీలు మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. మరోవైపు, 2019 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారు. ఈ అంశాన్ని మంత్రి హరీష్ రావు (ఆపద్ధర్మ) బుధవారం లేవనెత్తారు. ఆ పార్టీలను కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు.
ఎక్కడైనా చర్చకు రా, మీ దోస్త్ చంద్రబాబే చెప్పారు: జైపాల్కు హరీష్ సవాల్, రేవంత్ పేరును లాగి..
టీడీపీతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాము గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు పోతాయని హెచ్చరించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని తెలిపారు. ఏపీ టీడీపీ నేతలు కూడా రాహుల్ గాంధీ ఏపీకి హోదా ఇస్తామని చెబుతున్నారనే మాటలు చెబుతూ, బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అనిపిస్తోందని చెబుతున్నారు. తాము హోదా కోసం పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతుండగా, తాము గెలిస్తే ఇస్తామని రాహుల్ వేరుగా చెప్పారు. టీడీపీ - కాంగ్రెస్లు ఏపీలోను దగ్గర కావడానికి ఇది ఆయుధంగా మారే అవకాశాలు లేకపోలేదని చాలామంది భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ అప్పుడే తెలంగాణలో అడుగు పెట్టాలి
బానిస బతుకులు వద్దని తెలంగాణ సాధించుకున్నామని హరీష్ రావు చెప్పారు. కానీ కాంగ్రెస్ ఆంధ్రా పాలకులు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతోందని మండిపడ్డారు. తెలంగాణకు ఏపీతో సరిసమానమైన పారిశ్రామిక రాయితీలు కల్పిస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిందన్నారు. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇచ్చాకే తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు.
అసలు మేనిఫెస్టో అంటే తెలుసా?
తమ మేనిఫెస్టో కాపీ కొట్టారన్న కాంగ్రెస్ నేతల వాదనపై టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, బాల్క సుమన్లు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించనప్పటికీ పలు హామీలు ఇస్తోంది. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో కూడా అలాగే ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. దానిపై టీఆర్ఎస్ నేతలు స్పందించారు. మేనిఫెస్టో ప్రకటించకుండా కాపీ కొట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు మేనిఫెస్టో అంటే తెలియదన్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడిన వారంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు వచ్చినా నేనే గెలుస్తా.. తలసాని
ఓట్ల కోసమే తాము సెటిలర్లను పొగుడుతున్నామని విపక్షాలు చెప్పడం విడ్డూరమని తలసాని అన్నారు. ఎన్నికలు డిసెంబర్లో జరగనుండగా ఇప్పుడే గెలిచినట్టుగా కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరునే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సనత్నగర్లో చంద్రబాబు, లోకేష్లు వచ్చినా నేనే గెలుస్తానని తలసాని అన్నారు.
చంద్రబాబుతో కలవడం కాంగ్రెస్ ఘోర తప్పిదం
కాంగ్రెస్ పార్టీవి ఆపద మొక్కలు అని, అసలు మేనిఫెస్టో అంటే అర్థమే తెలియదని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలంగాణ వచ్చి అభివృద్ధి చెందుతుంటే తమకు ఏం వచ్చిందని కాంగ్రెస్ నేతలు అసహనంతో ఉన్నారన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఘోర తప్పిదమన్నారు. తామే గెలుస్తామంటూ ఊహల్లో తేలియాడుతున్నారని ఎద్దేవా చేశారు. తగిన ఫలితాన్ని కాంగ్రెస్ అనుభవిస్తుందన్నారు. ఒకవైపు ఎన్నికల్లో గెలుస్తామని చెబుతూ మరోవైపు ఎన్నికలు వద్దని డీకే అరుణతో కేసు వేయించడం ఆ పార్టీ భయాన్ని తెలియజేస్తోందన్నారు.
చంద్రబాబు వస్తే తగిన శాస్తి
టీఆర్ఎస్ మేనిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని బాల్క సుమన్ అన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప ఊరట అన్నారు. కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంకు ఇక విశ్రాంతి తప్పదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.