హరీష్ రావును ఒంటరి చేశారు, సీఎం కావడం ఖాయం: సర్వే సంచలనం
హైదరాబాద్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా రామాయం పేట మండలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు.
హరీష్ను ఒంటరి చేశారు.. సీఎం కావడం ఖాయం
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబం, హరీష్ రావును ఒంటరిని చేశారని సంచలన ఆరోపణల చేశారు.
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోయినప్పటికీ కేసీఆర్ తప్పుడు హామీలతో మోసగిస్తున్నారన్నారు. ఎస్పీ వర్గీకరణను పథకం ప్రకారమే కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే దీమా వ్యక్తం చేశారు.
తలసాని ఆగ్రహం
రిజర్వేషన్ల పెంపు అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి అవాకులు, చెవాకులు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత విశ్వాసాల ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునన్నారు.
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ముస్లిం, మైనార్టీలకు బీసీ-ఈ కేటగిరీలో రిజర్వేషన్లు పెంచుతున్నట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతామని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు.
టిడిపి జాతీయ పార్టీ ఎలా అవుతుంది?
వెనుకబడిన వర్గాల వారందరికీ న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. అలాంటప్పుడు టిడిపి జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు.
కేసీఆర్ తప్పుడు ప్రచారం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అక్రమాలను, అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కుతున్నారని, ప్రతిపక్ష పార్టీలుంటే అధికార పార్టీ పప్పులుడకవనే దురుద్దేశంతో అయిదు రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులను మభ్యపెట్టి తెరాసలో చేర్చుకున్నారన్నారు.
దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కేసీఆర్ చెబుతున్న మాటలు నిజమేనని, అప్పులు, రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని రావుల అన్నారు. టిఆర్ఎస్ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కోన్న కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, దళితులకు మూడెకరాలు భూపంపిణీ, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు.