తెలంగాణ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా లేఖలు రాసిన హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. మిషన్ కాకతీయ మూడో దశకు సహకరించడంతో పాటు పనుల్లో ప్రజలను భాగస్వాముల్ని చేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. మిషన్ కాకతీయ మూడో దశకు సహకరించడంతో పాటు పనుల్లో ప్రజలను భాగస్వాముల్ని చేయాలని ఆయన కోరారు.
ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేలందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు. గత రెండు దశలుగా మిషన్ కాకతీయ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నందుకు హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. రెండు విడతల్లో చేపట్టిన పనులను లేఖలో వివరించారు.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 17,000 చెరువుల పునరుద్దరణ పనులకు రూ.5,660 కోట్లు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామన్నారు. ఇప్పటి వరకు 11,400 చెరువుల పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. చెరువుల పునరుద్దరణ వల్ల అదనంగా 5 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందన్నారు. భూగర్భ జలమట్టం సరాసరి 10మీటర్లు పెరిగిందన్నారు.
కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మను తెలంగాణకు చెందిన పలువురు తెరాస ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఎంపీలు బాల్క సుమన్, బిబి పాటిల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కలిశారు. కేంద్ర పథకం స్వదేశీ దర్శన్లో రూ.100 కోట్లతో పెద్దపల్లి ప్రాంతంలో టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ చేపట్టాలని వారు కోరారు.
అలాగే కాళేశ్వరం, శివారం క్రొకడైల్ సాంక్షనరి, ధర్మపురి, కోటిలింగాల, గంధారివనం, ఎల్లంపల్లి, బౌద్ధారామాలను అభివృద్ధి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.