టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు ఎర్రబెల్లి, తలసాని ... కానీ హరీష్ కు దక్కని చోటు
Recommended Video
తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును పక్కన పెట్టారంటూ వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు క్యాంపెయినర్లుగా ఇరవై మందితో జాబితా అందజేసిన టిఆర్ఎస్ పార్టీ అందులో హరీష్ పేరు ప్రకటించలేదు. దీంతో హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టారన్న ప్రచారం జోరందుకుంది.
లోక్ సభ ప్రచారకుల జాబితాలో 20 మందికి స్థానం .. హరీష్ పేరు లేదు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కెసిఆర్ కేటీఆర్ లతోపాటు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి , ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, ఎస్.నిరంజన్రెడ్డి, వి ప్రశాంత్ రెడ్డి , పీ శ్రీనివాస్ యాదవ్ప, కేశవరావు, జై సంతోష్ కుమార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి , శేరి సుభాష్ రెడ్డి, ఆర్ శ్రవణ్ కుమార్ రెడ్డికుమార్ , బండ ప్రకాష్, టి రవీందర్ రావుల పేర్లు ఉన్నాయి. ఈ ఇరవై మంది జాబితాలో హరీష్ కు స్థానం లేకపోవడం పార్టీలో హరీష్ పరిస్థితి ఏమిటనేది తేటతెల్లం చేస్తుంది.
హరీష్ ను సిద్ధిపేటకే పరిమితం చేసిన తండ్రీ, తనయులు
టిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు హరీష్ పాత్ర కనిపించకుండా చేశారు. కేవలం సిద్ధిపేట శాసనసభ స్థానానికి మాత్రమే హరీష్ను పరిమితం చేశారు.మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్కు హరీష్ రావు హాజరయ్యారు. మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. ప్రతి విషయంలోనూ చురుగ్గా పాల్గొనే హరీష్ రావును ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది.
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?
పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని కేటీఆర్ వార్నింగ్ .. హరీష్ కు కూడానా ?
ఇటీవల శాసనసభ్యులు కొందరు ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలాంటి చర్యలకు శాసనసభ్యులు స్వస్తి చెప్పాలని ఆ మధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. కేటీఆర్ హెచ్చరిక హరీష్ రావుకు కూడా వర్తిస్తుందనే ప్రచారం సాగుతోంది. కావాలనే హరీష్ ను పక్కన పెడుతున్న తండ్రీ, తనయుల తీరుతో హరీష్ సైలెంట్ గా మారాడు. రాజకీయ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపించటం లేదు .
హరీష్ ను కలవాలంటేనే భయపడుతున్న నేతలు
గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ హరీష్ రావు పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారు. కానీ తాజా పరిణామాలతో టీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ రావును కలవడం మానేశారు. పార్టీ టికెట్లు పొందిన నేతలు, పదవులు దక్కించుకున్న నేతలు గతంలో హరీష్ రావును తప్పకుండా కలిసి ధన్యవాదాలు చెప్పేవారు. ఇప్పుడు కేవలం కేటీఆర్, కవితలకు ధన్యవాదాలు తెలిపారు. వారు హరీష్ రావును కలుసుకోకపోవడంపై పార్టీ అంతర్గత వర్గాల లో చర్చ కొనసాగుతోంది.లోకసభ టికెట్లు దక్కించుకున్నవారు కూడా కవితను, కేటీఆర్ ను మాత్రమే కలిశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికే హరీష్ పరిమితం ..
అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హరీష్ రావు కీలకమైన పాత్ర పోషించారు ప్రచారంలో కేసీఆర్ తర్వాత హెలికాప్టర్ ను వాడుకునే అవకాశం హరీష్ రావుకు మాత్రమే దక్కింది. కీలకమైన కాంగ్రెసు నేతలు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డికె అరుణ, జె. గీతా రెడ్డి, దామోదర రాజనర్సింహలను ఓడించే బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. సంగారెడ్డి మినహా అన్ని చోట్ల హరీష్ రావు తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఫలితాలు సాధించారు.
లోక్ సభ ఎన్నికల్లో హరీష్ ఊసే లేదు.. అడుగడుగునా హరీష్ కు అవమానం
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిన తర్వాత కేసీఆర్ హరీష్ రావును పూర్తిగా విస్మరించడం ప్రారంభించారనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఆయనకు ఏ విధమైన పాత్ర లేకుండా పోయింది.ఎప్పుడో గానీ హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లడం లేదు. అలాగే, ప్రగతిభవన్ ను సందర్శించిన సందర్భాలు కూడా చాలా తక్కువే. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కేసీఆర్ ను అతి కొద్ది సందర్భాల్లోనే కలిసినట్లు చెబుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఎక్కడ హరీష్ పేరు కూడా వినిపించకుండా పార్టీలో హరీష్ స్థానాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే గా పరిమితం చేశారు.