మొన్న హరీష్ సిబ్బంది, నిన్న మేయర్ డ్రైవర్, నేడు ముత్తిరెడ్డి.!తెలంగాణను కరోనా కాటేస్తోందా.?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కమ్మేస్తోంది. సాధారణ పౌరుల్లా కాకుండా పటిష్టమైన భద్రత మధ్య ఎంచుకున్న ప్రదేశాల్లో మాత్రమే సంచరించే ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకుతుందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకు తగ్గట్టే తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా గందరగోళంలో పడినట్టు తెలుస్తోంది. మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు విధించి యావత్ ప్రజానికాన్ని ఇళ్లకే పరిమితం చేస్తే దాని ప్రభావం ఆర్థిక రంగం మీద పడుతుందని ప్రభుత్వం వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
వాహనదారులకు కరోనా ట్యాక్స్ .. ప్రజలకు షాకింగ్ న్యూసే !!
విస్తరిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సోకుతున్న వైరస్..
సామాన్యులనే కాకుండా నిత్యం జాగ్రత్తలు తీసుకునే ప్రజా ప్రతినిధుల వరకూ కరోనా పాకుతుందంటే తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో కరోనా ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సోకిన పాజిటివ్ కేసులే నిర్ధారిస్తున్నాయి. సరైన చికిత్స తీసుకుందామనుకున్నా, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దామన్నా నాయకులు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాగా మహారాష్ట్రలో ఏకంగా ముగ్గురు మంత్రులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్టుగానే తెలంగాణలో కూడా వైరస్ విజృంభిస్తుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
జెట్టు స్పీడుతో వైరస్.. అయోమయంలో తెలంగాణ యంత్రాంగం..
ఎవరైనా ఎక్కడైనా అప్రమత్తంగా వ్యవహరించకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నట్లుగా మాయదారి వైరస్ ఇప్పటికే పలువురిని కాటేసింది. సామాన్యుడు, రాజకీయ నాయకుడు, సెలబ్రిటీ, సినిమా హీరో అనే తారతమ్యం లేకుండా ఎవరినైనా సరే ఇట్టే అంటేసే ఈ మహమ్మారి తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీకి చెందిన పలువురు నేతల సిబ్బందితో పాటు ఓ ఎమ్మెల్యేకి సోకింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమైనట్టు తెలుస్తోంది. వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ప్రజాప్రతినిధులకే వైరస్ సోకుతోంది.. ఇక సామాన్యుల పరిస్ధితేంటంటున్న ప్రజలు..
జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ గా తేలింది. ఇటీవల ఆయనకు జ్వరం రావటంతో పాటు గొంతునొప్పి లక్షణాల అనుమానంతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా, ముత్తన్నకు పాజిటివ్ అన్న విషయం నిర్ధారణ జరిగింది. దీంతో ముత్తిరెడ్డి నగర సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల మహమ్మారి లక్షణాలు కనిపించటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఐనప్పటికి కరోనా సోకడంతో ముత్తిరెడ్డి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
మరోసారి కఠిన ఆంక్షలు తప్పవు.. తెలంగాణ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ..
అంతే కాకుండా తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకు మాయదారి రోగం సోకటం ఇదే తొలిసారి. దీంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. మరోవైపు మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత సిబ్బందికి పాజిటివ్ గా తేలటంతో ప్రస్తుతం ఆయన క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇటీవల కాలంలో మహమ్మారి జోరు పెరిగిన నేపథ్యంలో రాజకీయనాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా నగర మేయర్ బొంతు రామ్మోహన్ వ్యక్తిగత డ్రైవర్ కు కూడా కరోనా పాజిటీవ్ తేలడంతో మేయర్ అప్రమత్తమయ్యారు. దీంతో మేయర్ స్వీయ నియంత్రణలోకి వెళ్లి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్ని అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించే తెలంగాణ సర్కార్, విస్తరిస్తున్న కరోనా కట్టడికి మరోసారి కఠినంగా వ్యవహరించాల్పిన పరిస్థితులు తలెత్తాయి.