కొంటే రూ.1000-అమ్మితే 1300: కరక్కాయల పేరుతో రూ.5కోట్లు టోపీ పెట్టారు!, బాధితుల గగ్గోలు
హైదరాబాద్: కరక్కాయల పొడికి మంచి డిమాండ్ ఉందని, కిలో కరక్కాయలు కొనుగోలు చేసి పొడిగా మార్చి ఇస్తే అధిక లాభాలు వస్తాయని గృహిణులను ఆకర్షించారు ఓ కంపెనీ నిర్వాహకులు. అంతేగాక, ఓ టీవీ ఛానల్లో ప్రకటన కూడా ఇచ్చారు. దీనికి ఆకర్షితులైన పలువురు ఒక్కొక్కరుగా చేరుతూ తమ మిత్రులను కూడా ఈ వ్యాపారంలో చేర్పించారు.
ఐదు నెలలు బాగానే సాగినా, ఆ తర్వాత అదో బోగస్ కంపెనీ అని తేలింది. దీంతో కరక్కాయల పేరిట వారి చేతిలో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమటూ వందల సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్బీలో చోటు చేసుకుంది.
కొంటే రూ.1000.. అమ్మితే.. రూ. 1300
సోమవారం కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీకాలనీ రోడ్డునెంబర్ 1లోని ఎంఐజి 1-165లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ వెలిసింది. ఆయుర్వేద మందుల తయారీకిగాను కరక్కాయ పొడిని కొనుగోలు చేస్తున్నట్లు, ఇంటివద్ద ఉండే మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోవచ్చునని పలు టీవీ చానళ్లలో 6309390734 ఫోన్ నంబర్తో సహా ప్రకటనలు ఇచ్చారు. దీంతో పలువురు సదరు నంబర్ను సంప్రదించగా కరక్కాయలను తామే అందిస్తామని కిలో కరక్కాయలకు రూ. వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, పొడిగా మార్చి తీసుకువస్తే అదనంగా రూ.300 లాభం కలిపి మొత్తం 1300 ఇస్తామని నమ్మించారు.
లక్షలు చెల్లించి కొన్నారు..
ఈ క్రమంలో పొడి రూపంలో తీసుకు వచ్చిన కొందరికి రూ.1300 చొప్పున చెల్లించారు. దీంతో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మధ్య తరగతి ప్రజలు ఏక మొత్తంగా డిపాజిట్లు చేసి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంస్థ మేనేజర్ ముప్పాల మల్లిఖార్జున్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్ల రూపంలో రసీదులు సైతం ఇచ్చాడు. దీంతో ఇంకా చాలా మంది రూ. లక్షలు చెల్లించి కరక్కాయలను కొనుగోలు చేశారు.
రూ.40లక్షలు చెల్లించిన ఓ బాధితుడు..
సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరుకుల బస్వరాజ్ అనే వ్యక్తి మొదట్లో రెండు వేలు వెచ్చించి రెండు కిలోల కరక్కాయలను కొనుగోలు చేశారు. అనంతరం పొడిగా మార్చి తీసుకురావడంతో అతనికి రూ.2600 ఇచ్చారు. దీనికితోడు సంస్థ డోర్ డెలివరీ పేరుతో సేవలను ప్రకటించడంతో అనేక మంది ఇళ్ల వద్ద ఉండే డిపాజిట్లు చెల్లించి కరక్కాయలను ఇళ్లవద్దకే తెప్పించుకున్నారు. కాగా, బస్వరాజ్ అతని స్నేహితులు సుమారు రూ.40లక్షలు చెల్లించి కరక్కాయలను తీసుకొని పొడిగా మార్చి తీసుకువచ్చారు.
ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి..
అగ్రిమెంట్ ప్రకారం బస్వరాజ్కి సోమవారం డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే, ఉదయం సంస్థ హెచ్ఆర్ మేనేజర్ ప్రసన్న అతడికి ఫోన్చేసి తమ సంస్థలో కీలక పాత్రధారి మల్లిఖార్జున్ ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఉందని, అతను అందుబాటులో లేడని తెలిపింది. దీంతో లక్షలు వెచ్చించిన బాధితులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సమాదాధానం చెప్పేవారు లేకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లబోదిబోమంటున్న బాధితులు
కాగా, వ్యాపారంలో వినియోగదారులను చేర్పిస్తే ఉద్యోగాలు ఉంటాయని, లేకపోతే తీసేస్తామని నిర్వాహకులు కంపెనీ ఉద్యోగులను కూడా బెదిరించారు. దీంతో వారు కూడా వినియోగదారులను చేర్పించారు. కేపీహెచ్బీలో స్థాపించిన ఈ బోగస్ కంపెనీలో ఇలా సుమారు 1500మంది వినియోగదారులు ఉన్నట్లు సమాచారం.
రూ.5కోట్లకు పైగా వసూలు చేసిన సంస్థ ప్రతినిధులు ఉడాయించారని బాధితులు లబోదిబోమంటున్నారు. వారి ఫిర్యాదు స్వీకరించిన సీఐ కుషాల్కర్ ఉన్నతాధికారుల సూచనమేరకు అదనపు ఇన్స్పెక్టర్ గోపీనాథ్కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, ఈ కరక్కాయల మోసం హైదరాబాద్ తోపాటు వరంగల్ జిల్లాలోనూ చేసినట్లు పోలీసులు గుర్తించారు.