మంత్రి మహమూద్ అలీతో కలిసి హరితహారం.. కరోనా రిస్క్ లో పోలీస్ ఉన్నతాధికారులు ?
తెలంగాణ రాష్ట్రంలోహోంమంత్రి మహమూద్ అలీకే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇప్పుడు హోం శాఖ ఉన్నతాధికారులలో కూడా టెన్షన్ పట్టుకుంది .గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో గత గురువారం నాడు ఆయనతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులకు కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.
Recommended Video
బ్రేకింగ్ ... తెలంగాణా హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్... అపోలోలో చికిత్స
మంత్రితో కలిసి హరితహారంలో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులు
గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గోషా మహల్ పోలీసు స్టేడియంలో మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ,హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ , డీసీపీలు,ఏసీపీలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మహమూద్ అలీకి కరోనా నిర్ధారణ కావటంతో అందరూ టెన్షన్లో పడ్డారు .
పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు కరోనా టెస్టులు
గురువారం నాటికే అనారోగ్యంతో ఉన్న మహమూద్ అలీ ఆ తర్వాత ఆస్తమాతో ఇబ్బందిపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆయన దగ్గర పనిచేసిన గన్ మెన్ లకు, వ్యక్తిగత సిబ్బందికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో శుక్రవారం నాడు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కరోనా టెస్ట్ లు ఇచ్చారు . వారి రిపోర్టుల విషయంలో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎందరు కరోనా బారిన పడతారో అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
పోలీస్ ఉన్నతాధికారులను కలిసిన వారికీ టెస్టులు
ఆ రోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు అందరూ ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా మంది అధికారులు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిని ఇప్పటి వరకు కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది . ప్రస్తుతం వీరందరి టెస్టులపై , వీరితో కాంటాక్ట్ అయిన వారు ఎవరన్న దానిపై దృష్టి సారించారు అధికారులు .
రిస్క్ లో హోం శాఖ అధికారులు .. టెన్షన్ పడుతున్న పోలీసులు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ పోలీసు శాఖను కరోనా వెంటాడుతోంది. పోలీస్ అకాడమీ లో తాజాగా 180 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏకంగా హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇటీవలకాలంలో ఆయనను కలిసిన పోలీసు ఉన్నతాధికారులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. హోం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పుడు కరోనా రిస్క్ లో పడ్డట్టుగా తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతుంది. కరోనా పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాటం చేసిన పోలీసులు సైతం కరోనా దెబ్బకు వణుకుతున్నారు. తాజా పరిణామాలతో భయపడుతున్నారు.