'గులాబీ'కి ముళ్లు కూడా ఉన్నాయని అధికార పార్టీ గ్రహించాలి..!!
ముందస్తు ఎన్నికలపైన తెలంగాణలో పార్టీలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయమంటు లెక్కలు చెపుతున్నాయి. వందసీట్లు గ్యారెంటీ అని అధికార పార్టీ చెపుతుంటే , కేసీఆర్ ను ఇంటికి పంపిస్తామని ప్రతిపక్షం వాదిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యేక బస్సుతో జనంలోకి వెళ్తోంది. కొత్త పార్టీ ఇంకా ఆఫీసుల ఓపెనింగ్ లో ఉంది. మిగిలిన పార్టీలు సరైన దోస్త్ ను వెతికే పనిలో ఉన్నాయి. మరో ఆరునెలల్లో ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలు చెపుతున్నప్పటిని లోలోన మాత్రం గుబులు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల నాడి అర్థంకాక అంతా హైరానా పడుతున్నారు. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న తెలంగాణ ప్రజల ఆశలు,ఆకాంక్షలు ఏమిటన్న దానిపైన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి. కేసీఆర్ మాత్రం వంద సీట్లతో మరో సారి ప్రభంజనం స్రుష్టిస్తామని పదే పదే చెపుతున్నారు. మరి చంద్రశేఖర్ రావు చెపుతున్న దాంట్లో వాస్తవం ఎంతో ఒక సారి పరిశీలిద్దాం..
సెంటిమెంట్ లేదు.. అభివ్రుద్ది మంత్రం అదికారాన్ని కట్టబెట్టగలుగుతుందా..??
నాలుగేళ్ల పాలనే గీటురాయి అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. కొత్త రాష్ట్రాన్ని అన్నింటా ముందు నిలిపాం కాబట్టి తమదే మళ్ళీ అధికారమన్నది వారి వాదన. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ ను దేశం ముందు సగర్వంగా నిలబెట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నారు. అవమానాలు, అనుమానాల మధ్య బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని అడుగులు వేయించామని ఆయన అంటున్నారు. సంక్షేమం, అభివ్రుద్ధి సమఫాలల్లో సాగిపోతుందని, అంతా సంతోషంగా ఉన్నారని చంద్రశేఖర్ రావు స్పష్టం చేస్తున్నారు. తాను ఇంత చేస్తుంటే ప్రతిపక్షాలకు జనం ఎందుకు ఓట్లు వేస్తారన్నది ఆయన ప్రశ్న. నిజమే కేసీఆర్ చెప్పే దాంట్లో కొంత నిజముంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడంలో చంద్రశేఖర్ రావు విజయవంతమయ్యారు. ఆర్థికంగా పురిపుష్టంగా ఉన్న రాష్ట్రం కావడంతో తాను అనుకున్నది ఆయన చేయగల్గారు. కొన్ని వర్గాల ఆకాంక్షలను నేరవర్చడంతో ఆయన సక్సెస్ అయ్యారు. అందుకే కేసీఆర్ ధైర్యంగా ఉన్నారు.
సంక్షేమ పథకాలు సానుకూల ఫలితాలను అందిస్తాయా..?
అభివ్రుద్ధి ఎలా ఉన్నా సంక్షేమం విషయంలో ప్రజలు తనను గుర్తు పెట్టుకుంటారన్నది ఆయన విశ్వాసం. నగదు రూపంలో జనానికి అందుతున్న సాయం తనకు ఓట్ల ను కురిపిస్తుందని చంద్రశేఖర్ రావు గట్టిగా నమ్ముతున్నారు. గతంలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే తనకు మళ్ళీ అధికారం వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఫించన్ల పెంపు, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్య శ్రీ,ఇందిరమ్మ ఇళ్లుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు 2009లో వై.ఎస్ కు రెండో సారి అధికారాన్ని కట్టపెట్టాయి. సంక్షేమం విషయంలో వై.ఎస్ తో చంద్రశేఖర్ రావుకు కొంత వరకు పోలికలున్నాయి. 1000 రూపాయల ఫించన్ , కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు జనంలోకి వెళ్లాయి. పేదలకు ఈ పథకాలు వరంలా కనిపిస్తున్నాయి. మరో వైపు రుణమాఫీ, రైతు బంధు, ఇరవై నాలుగు గంటల విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలు కేసీఆర్ కు ప్లస్ పాయింట్ గా మారనున్నాయి. మిషన్ భగీరథ పూర్తై ఇంటింటికి నల్లా వస్తే కచ్చితంగా జనం ప్రశంసలు పొందడం ఖాయం.
క్రింది స్థాయి అవినీతిని అరికట్టడంలో కేసీఆర్ విఫలం..!!
మరో వైపు అధికార పార్టీ నేతల అవినీతి వరదలై పారుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిజాయితీగా ఉండొచ్చు. కాని పాలన మాత్రం ఆ దిశగా సాగడం లేదని విమర్శలున్నాయి. గులాబీ చొక్కాలు ఎంతలా బరి తెగిస్తున్నాయో గ్రామాలను కదిలిస్తే తేలిపోతుంది. చెరువుల పూడికలు, రహదారుల నిర్మాణం, సిమెంటు రోడ్లు, భవనాల నిర్మాణం, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణి.. ఇలా టీఆర్ఎస్ నాయకుల చెలరేగిపోతున్నారు. కింద స్థాయిలో తొంభై శాతం మంది ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీలోనే ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలన్న ఆరాటంతోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్ళను జనం జాగ్రత్తగా గమనిస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో పచ్చచొక్కాలు విచ్చలవిడిగా చేసిన అవినీతి ఆ పార్టీని నిండా ముంచింది. చంద్రబాబు పాలన అద్భుతమన్న ప్రచారం జరిగినప్పటికి క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లు ఆయనను మాజీ సి.ఎంని చేశాయి.ఈ విషయంలో చంద్రశేఖర్ రావు ఏమీ మినహాయింపు కాదన్న విషయాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.
నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు కరువు..!
మరో వైపు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఎక్కువ మందికి గుర్తింపు లేకపోవడంతో వారంతా నిరాశాలోన్నారు. ఉద్యమ సమయంలో పదవులు అనుభవించిన వాళ్లు, తమను అణిచివేసిన వారు ఇప్పుడు మళ్ళీ అందలం ఎక్కి కూర్చోవడం వారికి మింగుడుపడటం లేదు. ఇలాంటి వారంతా ఈ సారి టీఆర్ఎస్ కు దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగులు, ప్రజా సంఘాలతో పాటు మేధావుల మద్దతు పూర్తి స్థాయిలో గులాబీ పార్టీ ఉండకపోవచ్చు. మరో వైపు కుప్పలు,తెప్పలుగా నాయకులు వచ్చి చేరడంతో టీఆర్ఎస్ ఇప్పుడు ఓవర్ లోడ్ అయింది. ఒక్కొక్కొ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడే నాయకులు అరడజను వరకు ఉన్నారు. వీరిలో ఒకరికి సీటు ఇచ్చి మిగిలిన వారిని బుజ్జగించి పనిచేయించుకోవడం అంత సులువైన పని కాదు. గ్రూపులు, ముఠాలతో చాలా నియోజకవర్గాలు నిండిపోయాయి. రాజకీయ జీవితమే పరమావధిగా బతుకుతున్న నాయకులను ఎన్నికలకు దూరంగా ఉంచడం చిన్న విషయం కాదు. ఈ కుమ్ములాటలను చంద్రశేఖర్ రావు ఎలా పరిష్కారిస్తారన్న దాని మీదే కనీసం నలభై నియోజకవర్గాల్లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. దీంతో గులాబీ గుచ్చానికి పైకి పూలు కనిపిస్తున్నా కింద ముళ్లు ఉంటాయన్న విషయాన్ని అదినాయకత్వం గుర్తెరగాలి.