రంగుల లోకం నుండి రాజకీయాల్లో.. విజయశాంతి సక్సెస్ అయ్యారా ? బీజేపీలో అయినా క్రియాశీలకంగా మారతారా ?
రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటి విజయశాంతి 1998 నుండి ఇప్పటివరకు అంటే 22 సంవత్సరాల కాలంగా రాజకీయ రంగం లోనే ఉన్నారు. అయినప్పటికీ విజయశాంతి రాజకీయంగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. ఇక తాజాగా మళ్లీ 22 సంవత్సరాల తర్వాత బిజెపిలో సొంతగూటికి చేరిన విజయశాంతికి ఈసారైనా బిజెపిలో సరైన గౌరవం దక్కుతుందా ? క్రియాశీలక పదవి దక్కుతుందా? ఆమె క్రియాశీలక రాజకీయాలను పోషిస్తారా ? అన్నది బిజెపి వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చ.
సినిమాలలో సక్సెస్ సాధించిన విజయశాంతి రాజకీయాల్లో ఇంకా ఒడిదుడుకుల్లోనే
సినిమాలలో సక్సెస్ సాధించిన విజయశాంతి అంతే సిన్సియర్ గా రాజాకీయాల్లో ఎఫర్ట్ పెట్టినా రాజకీయంగా ఆమె సాధించిన విజయాలు ఆమె ఖాతాలో పెద్దగా లేవనే చెప్పాలి. 1998లో బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది సినీ నటి విజయశాంతి. బిజెపిలో ఆమె మహిళా మోర్చా సెక్రటరీగా పని చేశారు. కొంతకాలం పాటు బిజెపిలో కొనసాగిన విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిజెపి నుండి బయటకు వచ్చారు.
తెలంగాణా ఉద్యమంలో కీలక భూమిక పోషించినా పెద్దగా రాని గుర్తింపు
ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీ ని స్థాపించారు.ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్న కెసిఆర్ కలిసి పోరాటం చేద్దామని విజయశాంతిని ఆహ్వానించారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కలిసి కొట్లాడింది విజయశాంతి . కేసీఆర్ కంటే ముందు నుండే ఆమె తెలంగాణా కోసం పోరాటం చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు . విజయశాంతి పార్టీని కూడా తమ పార్టీలో విలీనం చేయాలని విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు.
మెదక్ ఎంపీగా అవకాశం .. తెలంగాణా కోసం రాజీనామా చేసిన విజయశాంతి
2009లో తన పార్టీని విలీనం చేశారు విజయశాంతి. ఇక అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ఆ తరువాత సాగిన తెలంగాణ ఉద్యమం కోసం ఆమె ఎంపీ గా రాజీనామా చేశారు. జై తెలంగాణా అని నినదించారు . పార్లమెంటు సభ్యురాలు పదవిని కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తృణప్రాయంగా వదిలేశారు విజయశాంతి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడలేదనే ... తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోవడంతో, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా, అదే సమయంలో టిఆర్ఎస్ పార్టీలో పొమ్మనకుండా పొగ పెడుతున్న నేపథ్యంలో విజయశాంతి టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం వచ్చింది .మెదక్ అసెంబ్లీ నుండి విజయశాంతి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి స్టార్ క్యాంపైనర్ గా బాధ్యతలు అప్పజెప్పారు . కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యత తీసుకున్న విజయశాంతి టిఆర్ఎస్ పార్టీ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ లో 7 ఏళ్ళు వివాద రహితంగానే పని చేసిన విజయశాంతి
కాంగ్రెస్ పార్టీలో తనకు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించారు. ఏ పార్టీలో పనిచేసిన రాములమ్మ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించి, అనేక అంశాలలో ప్రతిపక్ష పార్టీ తరఫున, అధికార పార్టీని ప్రశ్నించి తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఏ పార్టీలో పనిచేసిన విజయశాంతికి తగిన ప్రాధాన్యత లభించలేదు అనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాల తరువాత తిరిగి సొంతగూటికి చేరిన విజయశాంతికి, ఈ సారైనా సరైన ప్రాధాన్యత లభిస్తుందా... క్రియాశీలకమైన పాత్ర విజయశాంతి బిజెపిలో పోషిస్తారా .. అనేది తెలియాల్సి ఉంది.
బీజేపీలో విజయశాంతి పరిస్థితి ఏంటి ? క్రియాశీలక పదవి దక్కుతుందా
ఏ పదవి ఇచ్చినా తన వంతు ప్రయత్నం చేశానని చెబుతున్న విజయశాంతి, తనకు కావాల్సింది తెలంగాణ ప్రజలందరూ బాగుండటమే అని తేల్చి చెబుతున్నారు. విజయశాంతి ఎన్ని పార్టీలు మారినా అక్కడ పార్టీ నిర్ణయాలు నచ్చకనే తప్ప, అవకాశవాద రాజకీయాలు విజయశాంతి ఎప్పుడూ చేసినట్టు కనిపించలేదు. రాజకీయాల్లో సీనియర్ అయినా ఇప్పటి వరకు ఏ కీలక పదవి ఆమెకు దక్కని కారణంగా ఈ సారి అయినా ఆమెకు కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అవ్వాలని చేస్తున్న ప్రయత్నాలలో విజయశాంతిని క్రియాశీలక రాజకీయాలలో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.