హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!
హైదరాబాద్ : హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ ఎన్నో మలుపులు తిరిగింది. మరెన్నో నిజాలు బయటపెట్టింది. దాదాపు పది రోజుల నుంచి మీడియాలో వివిధ కథనాలు వచ్చినా.. నిందితుడు రవిశేఖర్ నోటి నుంచి వచ్చిన నిజాలు విస్మయపరుస్తున్నాయి. దాంతో నిందితుడు మామూలోడు కాదుగా అనే టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో యాభైకి పైగా కేసులు నమోదు కావడంతో పాటు మోస్ట్ వాంటెడ్గా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇదివరకు ఒకటి రెండుసార్లు పట్టుబడ్డా.. పోలీసుల నుంచి తప్పించుకున్నాడనే వాదనలున్నాయి. మొత్తానికి హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో రవిశేఖర్ పట్టుబడటంతో మరిన్ని వాస్తవాలు వెలుగుచూశాయి.
మోస్ట్ వాంటెడ్
మోస్ట్ వాంటెడ్గా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న రవిశేఖర్ను మీడియా ముందుకు తీసుకువచ్చారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. జులై 23వ తేదీన ఉద్యోగం ఇప్పిస్తానంటూ హయత్నగర్లో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ చేసి ఎనిమిది రోజుల తర్వాత విడుదల చేశాడు రవిశేఖర్. ఆ క్రమంలో నిందితుడి కోసం పోలీసులు రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు. చివరకు ఆంధ్రప్రదేశ్లో నిందితుడి మూలాలు కనుగొని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వీడు మామూలోడు కాడు అనే విషయం స్పష్టమవుతోంది. ఇదివరకు నేరచరిత్ర కలిగి ఉన్న రవిశేఖర్ దాదాపు యాభైకి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండటం గమనార్హం.
ఆ కుటుంబానికి చేరువై.. కారుతో ఉడాయించిన ఘనుడు
మే 23వ తేదీన విజయవాడ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న రవిశేఖర్ రైలు ప్రయాణం ద్వారా కర్ణాటక రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కొప్పల్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంతో పరిచయం పెంచుకుని సన్నిహితుడిగా మారాడు. అయితే నిందితుడు రవిశేఖర్ చెప్పిన వివరాలను గుడ్డిగా నమ్మిన ఆ కుటుంబం అతడికి ఆశ్రయం కల్పించింది. అలా వారితో చనువుగా ఉంటూ.. కోటీశ్వరుడిగా బిల్డప్ ఇచ్చాడు. బళ్లారిలో తనకు 3 కోట్ల రూపాయల మేర ఆస్తులున్నాయని ఫోజు కొట్టాడు. అంతేకాదు చర్చి కట్టడానికి మీకు డబ్బులు ఇస్తానంటూ వారిని బురిడీ కొట్టించాడు. అలా మాయమాటలు చెబుతూ ఓ ఫైన్ మార్నింగ్ వారి ఐ20 కారుతో ఉడాయించాడు.
నకిలీ అధికారి అవతారం.. ఇలాంటి లీలలెన్నో..!
అలా అదే కారుతో జులై 21వ తేదీన హైదరాబాద్కు చేరుకున్నాడు రవిశేఖర్. ఆ క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చానంటూ ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అదే క్రమంలో 23వ తేదీ మంగళవారం నాడు హయత్నగర్లో బీఫార్మసీ విద్యార్థిని సోనిని కిడ్నాప్ చేశాడు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆమె నిందితుడిని పూర్తిగా నమ్మేసింది. ఏపీకి వెళ్లి ఆమెను ఎనిమిది రోజుల పాటు కారులో తిప్పాడు.
చివరకు 29వ తేదీనాడు అద్దంకి చేరుకుని ఆమెను అక్కడు ఉంచాడు. అదేరోజు అతడొక్కడే నల్గొండ వాడపల్లికి చేరుకుని నకిలీ అధికారి అవతారమెత్తాడు. ఓ ఎరువుల దుకాణం యజమానిని తనిఖీల పేరిట బెదిరించి 80 వేల రూపాయలు దోచుకెళ్లాడు. అయితే నిందితుడు విజయవాడ వైపు వెళ్లాడని తెలియడంతో ఏపీ పోలీసుల సాయం తీసుకున్నారు ఇక్కడి పోలీసులు. అదే క్రమంలో ఆమెను 30వ తేదీ మంగళవారం నాడు వదిలిపెట్టాడు.
నేరాల పుట్ట.. కదిలింది డొంక
సోనిని అద్దంకిలో హైదరాబాద్ బస్సు ఎక్కించిన నిందితుడు తిరుపతి వెళుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు అలర్టయ్యారు. మార్గమధ్యంలో రవిశేఖర్ను అరెస్ట్ చేశారు. రవిశేఖర్ను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు బాగా సహకరించారని తెలిపారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్.నిందితుడి మీద తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో దాదాపు 65కు పైగా కేసులు నమోదయ్యాయి.
2001 నుంచి నేరప్రస్థానం ప్రారంభించిన రవిశేఖర్పై ఏపీలో 50 కేసులు ఉండటం గమనార్హం. 2006 నుంచి 2017 వరకు తెలంగాణపై కన్నేసిన సదరు నిందితుడు విజిలెన్స్ ఆఫీసర్గా, జడ్జి కుమారుడిగా, ఏసీబీ అధికారిగా పూటకో వేషమేసి రోజుకో మోసం చేసేటట్లుగా తయారయ్యాడు. 2014లో భువనగిరిలో పీడీఎస్లో అక్రమాలు జరిగాయంటూ ఓ దుకాణం యజమానిని బెదిరించి దర్యాప్తు పేరిట ఆయన భార్యను తీసుకెళ్లాడు. రెండు రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో ఉండి.. ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టినట్లు సీపీ తెలిపారు. అలా చాలా నేరాల్లో డబ్బులు వసూలు చేయడమే గాక మహిళలను కూడా మోసం చేశాడట. అంతేకాదు అంగన్వాడీ వర్కర్స్ను ట్రాప్ చేసి మోసం చేసినట్లు వెలుగుచూసింది.