పుట్టగానే యూనిక్ కోడ్: బాలికల సంక్షేమంపై తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు
హైదరాబాద్: తీవ్ర వివక్షకు, అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లల రక్షణకు ఉమ్మడి హైకోర్టు పలు సూచనలు చేసింది. బాలికలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని, వారి సంక్షేమం కోసం తీవ్ర ఆలోచన చేయాల్సిన అవసరముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆడపిల్లపుట్టగానే ఓ యూనిక్ నంబరును కేటాయించి, 16 ఏళ్లు వచ్చేవరకు ఆ బాలిక పురోగతిని పర్యవేక్షిస్తుండాలని అభిప్రాయం వ్యక్తంచేసింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నాయో, లేదో తెలుసుకోవడానికి ఆ యూనిక్ నంబరు ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలనీ, ఆదిశగా లోతైన అధ్యయనం చేయాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బేటీ బచావో-బేటీ పడావో' పథకం వల్ల బాలికలకు కలిగే ప్రయోజనాల వివరాల్ని తమముందు ఉంచాలని ఇరు రాష్ట్రాలకు స్పష్టంచేసింది.
సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురైన యువతి ప్రత్యూష కేసు విచారణ సందర్భంగా.. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసింది.
విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) శరత్కుమార్ వాదనలు వినిపిస్తూ... ప్రత్యూష సొంత తల్లి పేరిట ఉన్న ఇంటిని ప్రత్యూష పేరుపై గిఫ్ట్డీడ్గా రిజిస్ట్రేషన్ చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటికే ఆ ఇంటిలో ఉంటున్నవారు ప్రత్యూషతో అద్దె విషయమై ఒప్పందం కుదుర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మల్కాజ్గిరి తహశీల్దారు పర్యవేక్షించాలని ఆదేశించింది.