ధర్నాచౌక్: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఉమ్మడి హైకోర్టు మండిపడింది. ధర్నాచౌక్ ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై హైకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించవచ్చు కానీ.. పూర్తిగా అణచివేయరాదని ఉన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.
ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎక్కడో ఊరు బయట ధర్నా చేసుకుంటే ఎవరు వింటారని ప్రశ్నించింది. మనుషులు ఉండని అడవిలో సెల్ఫోన్ టవర్ నిర్మిస్తారా.. ఇదీ అలాగే అని వ్యాఖ్యానించింది.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల కోసమే ధర్నా చౌక్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్లు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. ఏడాది నుంచి గడువు కోరుతూనే ఉన్నారని.. ఆలస్యం ఎందుకని ప్రశ్నించిన న్యాయస్థానం అందుకు మూడు వారాల గడువు ఇచ్చింది.