ఆ ఆర్డినెన్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు నోటీసులు.. ఉద్యోగుల,పెన్షనర్ల జీతాల రగడ
తెలంగాణా సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్ లకు షాక్ ఇస్తూ విపత్తులు వంటి అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లలో కోత విధించే నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది టీ సర్కార్. ఇక ఈ ఆర్డినెన్స్ పై తెలంగాణా హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణా ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ విశ్రాంత డీఎఫ్ఓ రామన్ గౌడ్ ఉన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.
ఆర్డినెన్స్పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
తెలంగాణా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రాత్రిలోనేతీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు . పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ఆ పిటిషన్ ను పరిశీలించి ఆర్డినెన్స్ పై తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఏ బేస్ లో ఆర్డినెన్స్ తెచ్చిందో చెప్పాలని కోరింది.
హడావిడిగా ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం
ఇక ఇప్పటికే తెలంగాణా సర్కార్ కు కరోనా విషయంలో తలంటిన హైకోర్టు తాజాగా ఆర్డినెన్స్ విషయంలో నోటీసులు జారీ చెయ్యటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమజెన్సీ అర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. తెలంగాణ విపత్తులు ప్రజారోగ్య ,అత్యయిక ఆర్డినెన్సు 2020కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ లో ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల కు చేసే చెల్లింపుల్లో 50 శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించింది.
రాత్రికి రాత్రి ఇలా ఆర్డినెన్స్ తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధం
ఇక కోత విధించిన మొత్తాన్ని ఆరు నెలలలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని పేర్కొంది. విపత్కర పరిస్థితిలో ఉద్యోగులకు పాక్షికంగాకాని, పూర్తిగాకాని వేతనాన్ని చెల్లించకుండా నిలుపుదల చేసే వేసులు బాటు కల్పించే నిమిత్తం తెలంగాణ డిజాస్టర్ అండ్ హెల్త్ అర్డినెన్స్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకురావటం అటు ఉద్యోగ , విశ్రాంత ఉద్యోగ వర్గాలకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. రాత్రికి రాత్రి ఇలా ఆర్డినెన్స్ తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు.
ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో ?
ప్రస్తుతం పెన్షన్ దారులకు 25 శాతం, ఉద్యోగులకు 50 శాతం వేతానాల్లో ప్రభుత్వం కోత విధించి జీతాలు ఇస్తుంది. ఇక ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పెన్షన్ దారులు హైకోర్టును అశ్రయించడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తో చెక్ పెట్టాలని భావించినది . ఉద్యోగులు కూడ ఇటీవల సిఎస్ ను కలిసి పూర్తి వేతాన్ని చెల్లించాలని విజ్జప్తి చేశారు. ఇక ఇదే సమయంలో ఆర్డినెన్స్ ను కూడా సవాల్ చేస్తూ విశ్రాంత ఉద్యోగులు కోర్టును ఆశ్రయించటంతో కోర్టు నోటీసులు జారీ చేసింది . ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.