'కేంద్రానికి టీ ప్రభుత్వం తప్పుడు నివేదిక వల్లే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా'
హైదరాబాద్: 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోలో నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది.
ఓయూ పర్యావరణ సైన్స్ పీహెచ్డీ స్కాలర్ ఎస్ కిరణ్ కుమార్, మరొకరు దీనిని దాఖలు చేశారు. రూ.50 కోట్ల వర్సిటీ నిధుల్ని ఖర్చు చేసి యూనివర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్లు భద్రత కారణాలు చూపుతూ కేంద్రానికి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్సీఏ) కార్యదర్శికి తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఐఎస్సీ వాయిదా పడిందన్నారు.
వందేళ్లలో తొలిసారి: ఓయులో నిరసనలు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా
ఓసారి కార్యక్రమం నిర్వహణకు తేదీలను ఖరారు చేసి వాయిదా వేయడం వల్ల యూనివర్సిటీ విద్యార్థులకు నష్టం వాటిల్లడంతో పాటు వర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నారు. ముందుగా నిర్ధారించిన షెడ్యూలు ప్రకారం దీనిని వర్సిటీలో నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కార్యదర్శి, తెలంగాణ సీఎస్, హోంశాఖ కార్యదర్శి, ఉస్మానియా వీసీ, రిజిస్ట్రార్, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.