భోజనానికి రూ.75లక్షలా?: హెచ్సీఏ తీరు పట్ల హైకోర్టు విస్మయం!
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భోజనాల కోసం ఏకంగా రూ.75 లక్షలు ఖర్చు చేసింది హెచ్.సి.ఏ.
హైదరాబాద్: కేవలం భోజన ఖర్చులకే రూ.75లక్షలు ఖర్చుపెట్టిన హెచ్.సీ.ఏ తీరు పట్ల హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భోజనాల కోసం ఏకంగా రూ.75 లక్షలు ఖర్చు చేసింది హెచ్.సి.ఏ.
ఈ భోజనాల ఖర్చుకు సంబంధించిన నివేదికను బీసీసీఐ ప్రతినిధి రత్నాకర్ షెట్టి సీల్డ్ కవరులో హైకోర్టుకు అందించారు. ఆయన ఈ మ్యాచ్ ను స్వయంగా పర్యవేక్షించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన బెంచ్ ఈ నివేదికలను పరిశీలించి విస్మయం వ్యక్తం చేసింది.
భోజనాలకే ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నివేదికలోని అంశాలు నివ్వెరపోయేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. కాగా, మ్యాచ్ సందర్భంగా 2వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించారని, వారి భోజనాల కోసం రూ.75 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని హెచ్సీఏ చెబుతోంది.
హెచ్.సీ.ఏ తీరు పట్ల ఏమాత్రం సంతృప్తి చెందని కోర్టు.. స్టేడియం సామర్థ్యంలో 25శాతం టికెట్లను కాంప్లిమెంటరీ కింద ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వీటన్నింటిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను పదిరోజుల పాటు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే, జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులకు కట్టుబడి హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ న్యాయవాది గోవిందరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు.. హెచ్.సీ.ఏ తీరుపై ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.