హెచ్సీయూ ఉద్యోగి దారుణ హత్య కేసును చేధించిన పోలీసులు: నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: జూన్ 6న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్సాగర్ సమీపంలో జరిగిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని వద్ద ఉన్న డబ్బులు కాజేయడానికే ఓ దుండగుడు హత్య చేసినట్లు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్సీయూ సెక్షన్ ఆఫీసరుగా పనిచేస్తున్న సత్యనారాయణ(56) గండిపేట మండలం హైదర్షాకోట్లో నివసిస్తున్నారు. 6వ తేదీన ఉదయం బండ్లగూడలోని ఓ కంపౌండ్ వద్ద ఆయన కల్లు తాగుతుండగా ఖలిస్థాన్ దర్గాకు చెందిన మహ్మద్ అజీమ్(32) అక్కడికి వచ్చాడు.
సత్యనారాయణ వద్ద డబ్బున్నట్లు గుర్తించి మాటలు కలిపాడు. కల్లు తాగుదామని నమ్మించి స్కూటీపై హిమాయత్ సాగర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సత్యనారాయణను కిందపడేసి తలపై బండరాయితో మోదాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Recommended Video
ఆ తర్వాత పర్సులోని 4వేలు దొంగిలించిన అజీమ్.. సత్యనారాయణ స్కూటీని కూడా తీసుకుని పరారయ్యాడు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఈ కేసును చేధించారు. అనంతరం అజీమ్ ను కటకటాల వెనక్కి నెట్టారు.