మరో వికెట్ డౌన్: సెలవుపై శ్రీవాస్తవ, దీక్షలో రాహుల్ గాంధీ, ఎబివిపి బంద్
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) అట్టుడుకుతూనే ఉంది. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించిన ఇంచార్జీ వీసీ శ్రీవాస్తవ సెలవుపై వెళ్లిపోయారు. ఇప్పటికే వీసీ పొదిలె అప్పారావు సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీవాస్తవ స్థానంలో పెరియస్వామి ఇంచార్జీ వీసిగా బాధ్యతలు చేపట్టారు.
ఇదిలావుంటే, రోహిత్ జయంతి సందర్భంగా హెచ్సీయూలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థి జేఏసీ ప్రారంభించిన మౌన దీక్షలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. వాస్తవానికి శనివారం ఉదయం ప్రారంభించాలని నిర్ణయించిన మౌన దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రికే ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు.
శంషాబాద్ నుంచి రాత్రి 12:30 సమయంలో నేరుగా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ వచ్చిన వెంటనే విద్యార్థులు 18 గంటల సామూహిక నిరాహార దీక్షను ప్రారంభించారు. వారితోపాటు రాహుల్ కూడా దీక్షలో పాల్గొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ ఆయన ఈ దీక్షను కొనసాగించనున్నారు. రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.
రాహుల్ రాకకు ముందు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ బర్తడే సర్కిల్ మెయిన్ రోడ్డు నుంచి రోహిత్ స్మారక స్తూపం వరకూ ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా హెచసీయూకు రాహుల్ రెండోసారి రావడంపై ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ మండిపడింది. ఆయన కాన్వాయ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. రాహుల్ రాకను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
హెచ్సీయూలో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రాజకీయం చేస్తున్నారని ఏబీవీపీ తెలంగాణ కార్యదర్శి అయ్యప్ప ధ్వజమెత్తారు. ఆయన తీరును నిరసిస్తూ శనివారం రాష్ట్రంలో కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంపీగా దేశవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడనని ప్రమాణం చేసిన రాహుల్.. ఉగ్రవాది యాకుబ్మెమన్ ఉరిని వ్యతిరేకించినవారిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.