ఆలిండియా నెంబర్ 1 ర్యాంకు: రికార్డు సృష్టించిన హెచ్సీయూ విద్యార్థిని
హైదరాబాద్: పీహెచ్డీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిరోజూ ఏదో ఒక వివాదానికి వేదికగా మారినప్పటికీ, వర్సిటీలోని విద్యార్ధులు మాత్రం రికార్డులను సృష్టిస్తూనే ఉన్నారు. హెచ్సీయూలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థి సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నెంబర్ 1 ర్యాంకును సాధించింది.
స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిగా అడుగుపెట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రసూనకు సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో 200 మార్కులకుగాను 158 మార్కులు వచ్చాయి. దీనిపై విద్యార్ధిని ప్రసూన మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా చదివానని చెప్పుకొచ్చింది.
తన డిపార్ట్మెంట్లోని ప్రొఫెసర్లు, యూనివర్సిటీ ఎంతగానో సహకారం అందించిందని కొనియాడింది. యూనివర్సిటీలో బోధన, పరిశోధన ఎంతో ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పరిశోధన రంగంవైపు వెళ్లేందుకే తాను హెచ్సీయూని ఎంచుకున్నట్లు చెప్పింది.
వచ్చే జూలై నెలలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్)లో పీహెచ్డీ ప్రవేశం పొందనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ నాల్గవ ర్యాంకు సాధించింది.