మెమెన్ అనుచరులకు, దేశభక్తులకు మధ్య పోరు: రోహిత్ వివాదంపై ఎబివిపి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ మృతిపై అసలు నిజాలు వెలికితీయాలని ఏబీవీపీ డిమాండు చేసింది. రోహిత్ మృతిని దళిత, దళితేతరుల మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది.
తీవ్రవాది యాకుబ్ మెమెన్ అనుచరులకు, దేశభక్తులకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటమిదని ఏబీవీపీ అభివర్ణించింది. వర్సిటీల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు, మావోయిస్టుల కదిలికలపై విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండు చేసింది.
రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళన కొనసాగుతోంది. వీసీ ఇప్పారావు దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. ప్రధర్ననలు నిర్వహించారు. రోడ్లపై విద్యార్థులు బైఠాయించారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై బుధవారంనాడు విశ్వవిద్యాలయాల బంద్ను పాటిస్తున్నారు.
రోహిత్ ఆత్మహత్యపై తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ఆందోళన జరిగింది. ఆందోళనకు దిగిన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయను, స్మృతి ఇరానీని మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.