రోహిత్ ఆత్మహత్య: ఇలాగైతే ఎలా.. పోలీసులపై హైకోర్డు జడ్జి ఆగ్రహం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ రాసిన లేఖతో పాటు ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాల నకళ్లను సమర్పించిన పోలీసులపై బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు పత్రాలను తమ ముందుంచాలని ఆదేశించింది. రోహిత్ ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రశాంత్ అనే విద్యార్థి దాఖలు చేసిన ఫిర్యాదులో తనను నిందితునిగా చేర్చారని, తనపై కేసు కొట్టివేయాలంటూ వీసీ అప్పారావు కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై జస్టిస్ పివి సంజయ్ కుమార్ బుధవారం నాడు విచారణ చేపట్టారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గచ్చిబౌలి పోలీసులు ఈ కేసుకు సంబంధించి నకలు పత్రాలను కోర్టు ముందుంచారు. దీనిపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా సమర్పిస్తే విచారణ ఎలా చేపట్టాలన్నారు.
రోహిత్ కులానికి సంబంధించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు నివేదిక సమర్పించినట్లు తెలిసిందని వీసీ తరఫు న్యాయవాది ఎన్వి సుమంత్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఒరిజినల్ పత్రాలను ఆలోగా సమర్పించాలని హోం డిపార్టుమెంటును ఆదేశించింది.