జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు, అది అవాస్తవం: హెచ్సీయూ వీసీ అప్పారావు
హైదరాబాద్: హెచ్సీయూలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు తానే కారణమని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు వెళుతూ మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
నిరాధారమైన ఆరోపణలతో రాజీనామా చేయాలంటున్న వారికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. తాను ఏ తప్పూ చేయకుండా రాజీనామా ఎందుకు చేయాలి? అని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నందున కుటుంబంతో సహా యూనివర్సటీ నుంచి బయటికి వెళ్లాలని నాతోపాటు క్రమశిక్షణ అధికారి అలోక్పాండే, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ప్రకాశ్బాబును డీసీపీ కార్తికేయ అదేశించారన్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య: మరిన్ని వార్తల కోసం
రోహిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఉన్నా... దాడి జరిగే ప్రమాదం, అపశృతి చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నందునే వెళ్లలేకపోతున్నానన్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని చెప్పిన ఆయన విద్యార్థుల కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వస్తుందని ఆశించినా ఫలితం లేకపోయిందన్నారు.
కోర్టు విచారణ పూర్తికాగానే రోహిత్ ఆత్మకు శాంతి కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అధ్యాపకులతో సమావేశమై యూనివర్సిటీలో నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తాను వైస్ ఛాన్సలర్ కాకముందు నుంచే ఆ ఐదుగురు విద్యార్థులపై సెమిస్టర్ పాటు పూర్తిగా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారని చెప్పారు.
అయితే వాళ్ల చదువుకు ఇబ్బంది కలగకుండా కేవలం హాస్టల్లో ఉండటం, యూనివర్సిటీ ఎన్నికల్లో పాల్గొనడం, ఆరుబయట ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించే అంశాల్లోనే చర్యలు తీసుకున్నానన్నారు. బహిష్కరణకు గురైన విద్యార్ధులకు మేలు చేయాలనే ఉద్దేశ్యం తప్ప, చెడు చేయాలనేది ఎంతమాత్రం కాదన్నారు.
ఇది ఇలా ఉంటే రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వీసీ, కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలని 14 విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. ఈనెల 23న ‘చలో హెచ్సీయూ' పేరుతో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.