రవి ప్రకాశ్ కు కేంద్రంలో ఆ పెద్ద మనిషి అండ..?!! అందుకే విచారణకు క్యాజువల్ గా హాజరు..!!
హైదరాబాద్ : తెలంగాణ లో మీడియాపై కబ్జా కొనసాగుతుందని, పేద రైతుల భూములపై ఎలాగైతే పోలీసులు, రెవెన్యూఅధికారులు ఒత్తిడితో దొంగ పత్రాలు సృష్టించి భూములను ఆక్రమిస్తారో, అదే పద్దతిలో మీడియాను అక్రమిస్తున్నారు అని టీవి9 రవి ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, వారు మోజో టీవీ ని పెట్టుకున్నారని, దానిని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు చేశారు.
కొంత మంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారని, సత్యాన్ని చంపేయబోతున్నారని అన్నారు. ఈ దౌర్జన్యాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలని, మీడియా కబ్జా పై జర్నలిస్ట్ లు అందరూ పోరాటం చేయాలని, ప్రజలు అందరు మీడియా కబ్జా పై గళం ఎత్తాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ గడ్డపై పరోక్షంగా ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేస్తున్న రవి ప్రకాశ్ స్వరంలో ఎందుకు మార్పు వచ్చింది. కేంద్రంలో ఆ పెద్ద మనిషి ఇచ్చిన భరోసాతోనే రవి ప్రకాశ్ చాలా క్యాజువల్ గా విచారణకు వచ్చి వెళ్లారనే చర్చ జరుగుతోంది.
అజ్ఞాతం వీడిన రవి ప్రకాష్..! సాధా సీదాగా విచారణకు హాజరు..!!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ 9 కేసులో రవి ప్రకాశ్ అజ్ఞాతం వీడడం.. పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం తెలిసిందే. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిలు పిటిషన్లు వేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే... ఫోర్జరీ వంటి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు.. రవి ప్రకాశ్ ఏమాత్రం ఉత్కంఠతకు గురి కాకుండా అంత నిర్భయంగా, సాదా సీదాగా కనిపించడం వెనుక ఆంతర్యమేంటన్న అంశం పై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.
కేంద్రంతో సత్సంబాంధాలు..! రవి కి అనుకూలంగా రాజకీయ పెద్దలు..!!
దీనికి కారణాలు లోతుగా పరిశీలించి చూస్తే ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ఠ్రాల్లో న్యూస్ చానల్ అంటే టీవీ నైనే అన్నట్లున్న పరిస్థితుల్లో దాన్ని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అనుకూల వ్యాపారవేత్త కొనుగోలు చేయడం.. ఆ తరువాత చానెల్ నుంచి రవి ప్రకాశ్ ను సాగనంపేందుకు ఏర్పాట్లు చేయడం.. ఈ క్రమంలో జరిగిన రచ్చలో రవి ప్రకాశ్ వైపు నుంచీ కొన్ని పొరపాట్లు ఉండడం వంటివన్నీ ఈ ఎపిసోడ్లో తారసపడతాయి. అయితే.. ఇందులో ఇంకో కోణమూ ఉంది. టీవీ 9 వంటి పాపులర్ చానల్ చంద్రశేఖర్ రావు చేతికి రావడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు రవి ప్రకాశ్కు చంద్రశేఖర్ రావును మించిన నేతల అండదండలూ ఉన్నాయన్నది మరో కోణం. ఆ అండదండలు లభించాకే ఆయన నిర్భయంగా పోలీసుల ముందుకొచ్చారని.. ఆ సంగతి అర్థమయ్యే పోలీసులూ ఆయన్ను ప్రశ్నించి వదిలిపెట్టారని తెలుస్తోంది.
మారిన రవి ప్రకాశ్ స్వరం..! మీడియా మాఫియా అంటూ ఘాటు వ్యాఖ్యలు..!!
ఈ గొడవంతా బయటకు రావడానికి ముందు ఇటీవల టీవీ9 జాతీయస్థాయి మీడియాగా విస్తరించినప్పుడు ఆ లాంచింగ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. ఆ కార్యక్రమంలో మోదీతో పాటు రవిప్రకాశ్ కనిపించారు. ఆయనకు జాతీయ స్థాయి నేతలతో మంచి సంబంధాలున్నాయని గతంలోనూ అనేకసార్లు రుజువైంది.ఈ నేపథ్యంలో ఆయన తన పరిచయాలను ఉపయోగించి కేంద్రం సాయం కోరారని.. అందులో భాగంగానే కోర్టుల నుంచి అనుకూలత రానప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి అరెస్ట్ థ్రెట్ ఉన్నప్పటికీ నిర్భయంగా పోలీసుల ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ పరిణామలన్నీ నిశితంగా గమనించిన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర పోలీసు శాఖను నిలువరించినట్లు సమాచారం.
కేంద్ర స్థాయిలో రవికి అండదండలు..! రాజకీయాలకు మీడియాకు పడుతున్న మెలిక..!!
అయితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడెందుకు ఆసక్తి అన్న ప్రశ్న కూడా కీలకమే. కానీ, దానికి విశ్లేషకులు చెబుతున్న సమాధానం కూడా ఆమోదయోగ్యంగానే ఉంది. బీజేపీ తెలంగాణలో విజయావకాశాలు వెతుక్కుంటున్న వేళ రవిప్రకాశ్ వంటి మీడియా కింగ్ చేతిలో ఉంటే అవసరమైతే ఇంకో చానల్ పెట్టించి బీజేపీ గళం వినిపించొచ్చన్నది ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ, రవి ప్రకాశ్ పరస్పర అవసరాలు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం ఇస్తాయని భావిస్తున్నారు. రవి ప్రకాశ్ ఉదంతం మీడియా రంగంలో ఇంకెంత సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాలి.