గత ఎన్నికల్లో సీయం అభ్యర్థి..! ఇప్పుడు కనీసం సీటు కూడా ఇవ్వని టీడిపి..! అయోమయంలో బీసి నేత..!
హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తెలుగు తమ్ముళ్లను అయోమయానికి గురి చేస్తోంది. టీడిపి అభ్యర్థులు ఆశిస్తున్నది ఒకసీటైతే అదిష్టనం కేటాయిస్తుంది మరో సీటు కావడంతో అవాక్కవుతున్నారు తెలుగుతమ్ముళ్లు. జంటనగరాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్నప్పటికి నియోజక వర్గాల ఎంపికలో తప్పుచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆర్ క్రిష్ణయ్య కు ఈ సారి పార్టీ టికెట్ కూడా కేటాయించకపోవడం శోచనీయం అంటున్నారు పార్టీ శ్రేణులు.
కూటమితో అన్యాయం..! ఉనికి కోల్పోయామంటున్న తెలుగుతమ్ముళ్లు..!!
మహాకూటమి నాయకుల్లోనే కాదు జనాల్లో కూడా టెన్షన్ పెంచుతోంది. కోదండరాం తీరు, రెబల్స్ బెడద పార్టీని బాధిస్తోంది. ఇక సీపీఐ పార్టీ బాగా సర్దుకుపోయింది. ఇక మిగిలింది తెలుగుదేశం. నిజానికి చాలా సైలెంట్గా రాజకీయాలు చేస్తూ మహాకూటమి వివాదాల్లో అతితక్కువగా వార్తల్లో నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ లిస్టులో రెబల్స్, ట్విస్టులు భారీగా ఉన్నా టీడీపీ మాత్రం వాటిని బ్యాలెన్స్ చేసుకుని సర్దుకుపోయింది. కానీ సడెన్గా తెలుగుదేశంలో కొత్తగా వినిపించిన వార్త కల్లోలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎల్బీనగర్ లో వింత నాటకం..! ఇబ్రహింపట్నం లో విచిత్ర పిరిస్థితి..!!
గత ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుండి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన క్రిష్ణయ్యను ఈ సారి కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్డీనగర్ సీటును కావాలనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్ సీటు తెలుగుదేశం పార్టీ కి కేటాయిస్తే మళ్లీ క్రిష్ణయ్య నే అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంటుందని, పార్టీ ముఖ్యనేతలకు అందుబాటులో ఉండక పోవడంతో, పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కారనే ఆరోపణలు క్రిష్ణయ్య పై ఉన్నాయి. కొన్ని సందర్బాల్లో తాను బీసి నేతగా కొనసాగుతాను తప్ప ఏ పార్టీకి ప్రతినిదిగా కొనసాగబోనని గతంలో ఆయన స్వయంగా ప్రకటించుకోవడం కూడా వివాదాస్పదమైంది. దీంతో ఆర్ క్రష్ణయ్యకు సీటు కేటాయించి మరో ఐదేళ్లు భారం మోసే కన్నా నియోజక వర్గాన్ని ఒదిలేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని టీడిపి అదిష్టానం భావించినట్టు తెలుస్తోంది. అందుకే బీసీ నేత అనికూడా చూడకుండా క్రష్ణయ్యను టీడిపి ఒదిలేసుకుందనే చర్చ జరుగుతోంది.
ఎల్బీనగర్ లో సామా కు మంచి ప్రజాబలం..! కాని సీటు ఇవ్వని టీడిపి..!!
ఇక ఇదే ఎల్బీ నగర్ లో గత ఎన్నికల్లో సీటు కోల్సోయిన సామా రంగారనెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండాగా ఉన్నారు. టీడిపి తరుపున ఈ సారి బరిలో దిగేందుకు అనేక ప్రయత్నాలు చేసారు. అమరావతిలో అనేక సార్లు చంద్రబాబును కలిసిన రాంగారెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తనకే కేటాయించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు యల్ రమణతో పలు మార్లు భేటీ ఐన రాంగారెడ్డి ఎల్బీనగర్ తనకు కేటాయించాలని కోరారు. ఐతే పొత్తులో భాగంగా ఎల్బీనగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కి వెళ్లిపోవడంతో రంగారెడ్డి ఖంగుతిన్నారు. ఐతే రంగారెడ్డిని ఇబ్రహీం పట్నంలో పోటీ చేసేందుకు టీడిపి అదిష్టానం అవకాశం కల్పించింది. ఐతే ఇబ్రహీం పట్నం నియోజక వర్గం తనకు కొత్త అవుతుందని, అక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశం ఉండదని రంగారెడ్డి తన వాదనను వినిపిస్తున్నారు. తనకు ఎలాగైనా ఎల్బీనగర్ కేటాయించాలని ఆయన డిమండ్ చేస్తున్నారు.
టీడిపిలో రెబల్స్..! బుజ్జగించేపనిలో నామా..!!
తాజాగా టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తా పేర్లను ఈ జాబితా ద్వారా ప్రకటించింది. కూకట్పల్లి గురించి ఏ ప్రకటనా రాలేదు. కాకపోతే సుహాసిని నిలబడితే హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ అండ ఆమెను సులువుగా గట్టెక్కిస్తాయంటున్నారు. రేపు సాయంత్రానికల్లా లేదా ఎల్లుండి ఉదయం ప్రకటన వచ్చే అవకశం ఉంది. అంతే కాకుండా సీటును ఆశించి నిరాశ చెందిన నాయకులు పెద్ద యెత్తున తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతున్నారు. షేర్ లింగం పల్లిలో మొవ్వా సత్య నారాయణ, కుత్బుల్లాపూర్ లో బూర్గువావి హన్మంత రావు, కూకట్ పల్లి నుండి పెద్దిరెడ్డి, జూబ్లీహిల్స్ నుండి అనూషా రాం, జేవీజి నాయుడు, ఖైరతాబాద్ నుండి లంకల దీపక్ రెడ్డి, రాంజేందర్ నగర్ నుండి వల్లభనేని అనిల్, ఎల్బీ నగర్ నుండి సామా రంగారెడ్డి, ఇబ్రహీం పట్నం నుండి రొక్కం భీంరెడ్డి, దేవర కద్ర నుండి సీతా దయాకర్ రెడ్డి , అలేరు నుండి బండ్రు శోభారాణి కోదాడ నుండి బొల్లం మల్లయ్య యాదవ్ లాంటి నాయకులకు అన్యయం జరిగినట్టు చర్చ జరుగుతోంది.