నపుంసకుడు కాదు మృగాడు, సైకో శ్రీనును ఉరితీయాలి, పోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్
హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోక్స్ స్పెషల్ కోర్టులో శ్రావణి కేసు సందర్భంగా పీపీ.. శ్రీనివాస్ రెడ్డి అరచాకాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిందితుడిపై జాలి దయ చూపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వెలుగులోకి వచ్చింది ముగ్గురు బాలికలేనని.. ఇంకెందరు బాధితులు ఉన్నారోనని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కూడా..
బాలికలపై లైంగికదాడి చేసి.. అత్యంత పాశవికంగా హత్య చేశాడని పీపీ ధర్మసనానికి తెలిపారు. అత్యంత క్రూర మనస్తత్వం కలిగిన వారికి ఉరిశిక్ష సరైనదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శ్రావణి కేసుకు సంబంధించి వాదనలు ముగిశాయి. మిగతా ఇద్దరు బాలిక హత్యకు సంబంధించి వాదనలను మంగళవారం వింటామని.. విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
సంక్రాంతి లోపే శిక్ష..
కేసుకు సంబంధించి విచారణ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 48 పనిదినాల్లో కేసు విచారణ కొనసాగింది. 101 మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోరెన్సిక్ నివేదికను కూడా న్యాయస్థానం పరిశీలించింది. సోమవారం విచారణ జరిగి.. మంగళవారానికి వాయిదా పడింది. ఈ వారంలో వాదనలు పూర్తై.. తీర్పును ధర్మాసనం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి లోపు కోర్టు నిందితుడికి శిక్ష వేసే ఛాన్స్ ఉంది.
మగాడిని కాదు
ఇదిలా ఉంటే శుక్రవారం రోజున కోర్టులో మేజిస్ట్రేట్, శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మొబైల్లో ఆశ్లీల సినిమాలు, ఫొటోలు ఉన్నాయని అడిగితే తనకు స్మార్ట్ ఫోన్ లేదని చెప్పారు. మృతురాలి డ్రెస్సులపై స్పెర్మ్ ఉందని అడిగితే తనను పోలీసులు నిర్బంధించి సిరంజి ద్వారా సేకరించారని చిలకపలుకులు పలికారు. బాలికలను బైక్పై తీసుకెళ్లి లైంగికదాడి చేయడమే గాక బావిలో పూడ్చి పెట్టావని నిలదీస్తే.. తాను నపుంసకుడినని.. అలాంటప్పుడు లైంగికదాడి ఎలా చేస్తానని చెప్పి జడ్జీనే విస్మయానికి గురిచేశాడు. తనకు బైక్ నడపడం కూడా రాదని కలరింగ్ ఇచ్చాడు.