నువ్వు.. నేనూ.. మోడీని నమ్మి మోసపోయాం, కేసీఆర్తో చేతులు కలిపేందుకు సిద్ధం: బాబు
విశాఖపట్నం/అమరావతి/హైదరాబాద్: ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ - 2018లో ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ పైన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటయ్యే కూటమిలో చంద్రబాబు కూడా ఉన్నారు. మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జరుగుతున్న ఈ కాన్క్లేవ్లో చంద్రబాబు మాట్లాడుతూ... తమ కూటమిలోకి తెరాస వస్తే స్వాగతిస్తామని చెప్పారు. కేసీఆర్ బీజేపీతో కలిస్తే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీజేపీయేతర కూటమికి తానే చొరవ తీసుకున్నానని చెప్పారు. తనకు ప్రధానమంత్రి పదవి పైన ఎలాంటి ఆశ లేదని చెప్పారు.
కేసులు మా ఎంపీల పైనే ఉన్నాయా, అమిత్ షా మాటేమిటి?
తమ పార్టీ ఎంపీల పైన ఉన్న కేసులను ప్రస్తావిస్తున్నారని, కేవలం మా పార్లమెంటు సభ్యుల పైనే ఉన్నాయా.. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన లేవా అని చంద్రబాబు ప్రశ్నించారు. నరేంద్ర మోడీ జాతి మొత్తాన్ని మోసం చేశారని, ఇంత చెత్త ప్రభుత్వాన్ని తాను చూడలేదని చెప్పారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, దానిని అడ్డుకోవడానికే కూటమికి చొరవ తీసుకున్నానని చెప్పారు.
కేసీఆర్ ఆ తీరుపై అభ్యంతరం
ప్రధాని పదవి చేపట్టాలని 1996 నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని, వాటిని తిరస్కరించానని చంద్రబాబు చెప్పారు. ఏపీని అభివృద్ధి తన ముందున్న కర్తవ్యమన్నారు. ప్రధాని పదవిని నేను కోరుకోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో నూరుశాతం మేమే గెలుస్తామని చెప్పారు. మోడీకి బదులు ఎవరు ఉన్నా బాగా పాలిస్తారని చెప్పారు. తాము జాతీయ స్థాయిలో బీజేపీయేతర ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, బీజేపీతో టీఆర్ఎస్ చేతులు కలపడంపట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని చెప్పారు.
అందుకే కేసీఆర్ మా వైపు రావాలి
థర్ట్ ఫ్రంట్లో భాగంగా కేసీఆర్ తనను కూడా కలువొచ్చునని, ఎవరైనా ఆచరణ సాధ్యమైన పరిష్కారం ఆలోచించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్గానీ, బీజేపీ గానీ ఏర్పాటు చేసే ప్రభుత్వాలకు మద్దతివ్వాల్సిందేనని చంద్రబాబు చెప్పారు. లేదంటే రెండు పార్టీల్లో ఏదో ఒకటి మద్దతిచ్చే ప్రభుత్వమైనా ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, అందుకే కాంగ్రెస్తో కూడిన కూటమిలో కలసి పని చేసేందుకు కేసీఆర్ ముందుకు వస్తే స్వాగతిస్తామని చెప్పారు.
నవ్వు.. నేను.. మోడీని నమ్మి మోసపోయాం
మోడీని, ఆయన నినాదాలను మీరూ నమ్మారు.. నేనూ నమ్మానని, చివరకు మనమంతా మోసపోయామని చంద్రబాబు అన్నారు. మొదట్లో మోడీ, నేను మంచి మిత్రులమని, మంచి విమర్శకులం కూడా అన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను విమర్శించానని, గోద్రా ఘటన సమయంలో ఆయన రాజీనామాకు డిమాండ్ చేశానని మీకు జాతి ప్రయోజనం కావాలో, గుజరాత్ కావాలో నిర్ణయించుకోవాలని నాటి ప్రధాని వాజపేయికి చెప్పానని, ఈ రోజు కూడా నేను మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నానని, అంతేకానీ వ్యక్తిగతంగా ఆయనతో విభేదాల్లేవన్నారు.
ఏపీని కాంగ్రెస్ విభజించింది కానీ
కాంగ్రెస్ ఏపీని విభజించిన మాట వాస్తవమేనని, అందుకే వాళ్లపై పోరాడామని, ఆ పార్టీనే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందని చంద్రబాబు అన్నారు. మోడీ జాతి మొత్తాన్ని మోసం చేశారన్నారు. ఏపీని మరింత మోసం చేశారన్నారు. మాపై కక్షతో రేపు ఇంకేమైనా చేయవచ్చునని, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థల్ని ప్రయోగిస్తారని, తమ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనేకసార్లు దాడులు చేయించారన్నారు.