ఐటీ గ్రిడ్ కు డేటా పంపింది ఆయనేనా ... లోకేష్ కు షాక్ ఇస్తూ తెలంగాణా పోలీసుల నోటీసులు ?
ఏపీ తెలంగాణాల మధ్య డేటా వార్ ముదురుతోంది. ఇప్పటికే చంద్రబాబుపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఏపీ మంత్రి లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నారు. డేటా చౌర్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఏపీకి చెందిన ఆయా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. డేటా చౌర్యం తీవ్రమైన నేరం కావడంతో.. తమ నేరం బయటపడితే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్న ఏపీ అధికార పార్టీ రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం చట్టపరంగా ముందుకు వెళుతుంది.
సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. తస్కరణకు గురైంది కేవలం ఏపీ పౌరుల సమాచారమేనా? తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారానికీ ముప్పు వాటిల్లిందా? అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ సమాచారం ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.డేటా చౌర్యం కేసులో టీడీపీ నాయకులతోపాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ గ్రిడ్స్ కంపెనీ సీఈవో అశోక్ ఏపీ మంత్రి - టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.