లోన్ ఇస్తామంటూ స్వీట్ వాయిస్... ఫోన్ కట్ చేస్తే... రెండున్నర లక్షల టోపీ..!! ఎలా అంటే...
హైదరాబాద్: సైబర్ క్రైమ్ ని అదుపు చేయడానికి సగర పోలీసులు ఎంత అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారో, మోసగాళ్లు కూడా అంతకు రెట్టింపు టెక్నాలజీని వాడుతున్నట్టు తెలుస్తోంది. కేవలం 2000 రూపాయల చీరకు 50వేలు చెల్లించడం, బిర్యాని కోసం పాతిక వేలు చెల్లించడం వంటి సంఘటనలు తరుచుగా చూస్తున్నాం. తాజాగా వడ్డీ లేని బ్యాంకు రుణాల పేరిట తీయటి ఫోన్ కాల్స్ కూడా మోసంతో కూడుకున్నవని తెలుస్తోంది. ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులు, గృహిణులు, ప్రయివేటు ఉద్యోగులనే టార్గెట్ చేస్తూ సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ లో పిన్ నంబర్, ఓటీపి తదితర వివరాలు చెప్పకూడదని ఎంత ప్రచారం కల్పిస్తున్నా ఎక్కడోచోట అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా నగరంలోని ఓ విద్యార్థి వడ్డీ లేని రుణం అనే సరికి మొత్తం బ్యాంకు వివరాలు చెప్పి నిలువునా మునిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణకు కేంద్రం ఆర్థిక చేయూత..! భారీగా నిధుల విడుదల..!!
మోసాలకు అడ్డాగా మారుతున్న నగరం..!రెచ్చిపోతున్న సైబర్ క్రైం నేరగాళ్లు..!!
నగరంలో మోసాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అందుకు అధునాతన సాంకేతికతను అడ్డంగా వాడుకుంటున్నారు. నగరంలో రోజురోజుకి సైబర్ క్రైమ్ పెరిగిపోతోంది. ఓ విద్యార్థికి వడ్డీ లేకుండా రుణమిస్తామంటూ 2.5 లక్షల రూపాయలకి బురిడి కొట్టించాడు ఓ మోసగాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన నారాయణ బీటెక్ చదువుతున్నాడు. అతనికి కొన్ని రోజుల కిందట ఓ అపరిచితుడి నుండి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఇండియా బాల్స్ ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు మా సంస్థ నుంచి వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. అమాయకంగా నమ్మిన విద్యార్థిని నిలువునా ముంచారు సైబర్ నేరగాళ్లు.
అమాయకుల అవసరాలతో చెలగాటం..! అడ్డంగా బుక్కవుతున్న నగర ప్రజలు..!!
దీనికి కేవలం మీ ఆధార్, పాన్ కార్టు, బ్యాంక్ ఖాతా నంబర్ ఇస్తే చాలు, 48 గంటల్లో మీ ఖాతాలో 2 లక్షల రూపాయల రుణం జమవుతుందని వివరించారు. ఇది నిజమని నమ్మిన నారాయణ రుణం అవసరం ఉందని చెప్పాడు. మొదటగా రిజిస్ట్రేషన్ కింద 4,500 రూపాయలను జమ చేయాలని చెప్పగా, ఆ నగదును జమ చేశాడు నారాయణ. ఆ తర్వాత ఇన్కమ్ట్యాక్స్, జీఎస్టీ, ఆర్బీఐ సర్టిఫికెట్స్ ఫీజులంటూ మొత్తానికి నారాయణ నుంచి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తరచూ మాట్లాడి 2.5 లక్షల రూపాయలను కాజేశారు. తీరా మోసపోతున్నానని గుర్తించిన బాధితుడు తన డబ్బు వెనక్కీ ఇవ్వాలని వారిని కోరాడు. సొమ్ము పోయిన తర్వాత ఎంత గగ్గోలు పెడితే ఏం ప్రయోజనం.??
వడ్డిలేని రూణాలంటూ తీయటి కాల్స్..! మోసపోతున్న యువత..!!
అంతే కాకుండా సైబర్ మోసగాళ్లు తియ్యని మాటలతో నీ డబ్బు ఎక్కడికీ పోదు, మొత్తం నీకు తిరిగి వస్తుంది.. ఆందోళన వద్దు అంటూ మరికొంత నగుదు డిపాజిట్ చేయాలని కోరారు. రుణంతో పాటు మీరు చెల్లించిన అధిక నగదు కూడా వస్తుందని నమ్మించే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలపై అనుమానం వచ్చి మోసపోయానని గుర్తించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదువుకున్నవారు, ఉద్యోగులు, బిజినెస్ చేస్తున్న వారు సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మి మోసపోతున్నారు.
ఆశకు అంతం ఉండదు..! గుడ్డిగా బ్యాంకు వివరాలు చెప్పేస్తున్న సామాన్యులు..!!
ఇటీవల తమకు వస్తున్న ఫిర్యాదుల్లో బ్యాంకు రుణాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెప్పుకొస్తున్నారు. 5జీ టెక్నాలజీ పరుగెడుతున్న తరుణంలో ప్రజలు ఇంకా గుర్తు తెలియనివారి ఫోన్ మాటలకే లక్షలాది రూపాయలను చెల్లిస్తుండడం చాలా బాధ కలిగిస్తుందని, అప్పు వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న వారు, ఊల్టా డబ్బులు చెల్లించి రుణం కోసం ఎదురుచూడడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించుకోవాలని పోలీసులు హితవు పలుకుతున్నారు. రుణంతో అప్పు తీరుతుందనుకుంటున్న వారు.. సైబర్ మాయగాళ్ల చేతుల్లో పడి నెత్తి మీద మరో భారాన్ని వేసుకుంటున్నారని, అలా నమ్మి మోసపోవద్దని, ఒకటి రెండు సార్లు అలాంటి కాల్స్ వస్తే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.