టీటీడిపి కి తలనొప్పిగా మారిన సీట్ల సర్దుబాటు..! రంగంలోకి చంద్రబాబు..!!
హైదరాబాద్ : టీడీపీ మహాకూటమిలో గౌరవప్రదమైన సీట్లు సాధించుకోవడం కోసం ఇప్పుడే ఉద్బవించిన రాజకీయ పార్టీతో పోటీ పడుతోంది. ఒకప్పుడు తెలంగాణలో తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇతర పార్టీలు వెంపర్లాడుతుండేవి. కూటమిలో కీలక భూమిక టీడీపీ పోషించేది. చివరికి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి సైతం 2009లో చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగి అప్పటి మహాకూటమిలో చేరడానికి నానా తంటాలు పడింది. కానీ తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు భిన్నంగా ఉన్నాయి.
Recommended Video
టీజేఎస్ కన్నా రెండు ఎక్కువ కావాలంటున్న టీటీడీపీ..!సీట్ల సర్దుబాటులో సంకటస్ధితి..!
రాష్ట్ర విభజన అనంతరం కూడా టీడీపీకి పదిహేను సీట్లు కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగుదేశం పార్టీ ఛరిష్మాను కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే తెలంగాణలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కనీస ప్రాతినిధ్యం దక్కాలంటే ఎవరో ఒకరి ఆసరా తప్పని సరి. దీన్ని గ్రహించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు చూపుతో కర్నాటక ఎన్నికలు జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. ఈ సారి కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమిలో భాగస్వామి అయితే ఖచ్చితంగా పదో, పరకో అసెంబ్లీ స్ధానాల్లో గెలుపొంద వచ్చని, దాంతో టీడీపీకి తెలంగాణలో మళ్లీ పునరుజ్జీవం కల్పించవచ్చనేనది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
కేటీఆర్ తారక మంత్రం..! అసంత్రుప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర..!!
పట్టు విడుపు అవసరం..! అలాగే గౌరవప్రధమైన సీట్లు కూడా కావాలి..!!
అందుకు తగ్గట్లుగానే సీట్లు సర్ధుబాటు విషయంలో ఇంత కాలం పట్టు విడుపుల ధోరణి అవలంబించారు చంద్రబాబు. తెలంగాణ ప్రాంత నాయకత్వం సీట్ల అంశంలో ఎక్కువ ఆశలు పడొద్దని, గెలవగలిగే స్ధానాలు మాత్రమే డిమాండ్ చేయాలని హితబోధ కూడా చేశారు. తెలంగాణలో ఎలాగైనా టీఆర్ఎస్ ను గద్దె దింపాలన్న బలమైన కాంక్షతో ఒక దశలో పది నుంచి పన్నెండు స్ధానాలతో సరిపెట్టుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు తీరా కూటమి పొత్తులు ఫైనలైజ్ అయ్యే చివరి అంకం వచ్చే సరికి టీడీపీకి మరో చిక్కొచ్చి పడింది.
కూటమిలో కాంగ్రెస్ తర్వాత పెద్దన్నగా టీడిపి..! అందుకే ఎక్కువ సీట్లు..!!
మహాకూటమిలో పన్నెండు సీట్లతో సరిపెట్టుకోవడానికి మానసికంగా సిద్దమై పోయిన టీడీపీకి ఇప్పుడు పరువు సమస్య తలెత్తింది. నిన్న కాక మెన్న ఏర్పడిన ప్రొఫెసర్ కోదండరామ్ సారధ్యంలోని తెలంగాణ జన సమితి డిమాండ్ చేస్తున్న సీట్ల సంఖ్య చూసి టీడీపీ ఖంగు తింటోంది. ఒకవేళ మహాకూటమిలో సీట్ల సర్ధుబాటులో భాగంగా టీజేఎస్ అడిగినన్ని సీట్లు ఆ పార్టీకి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దమైపోతే, టీడీపీకి అంతకంటే అవమానం ఇంకోటి ఉండదనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. దీంతో టీడీపీ అగ్రనాయకత్వం పునరాలోచనలో పడింది.మహాకూటమిలో కాంగ్రెస్ తరవాత రెండో పెద్ద భాగస్వామిగా టీడీపీనే ఉండాలనే డిమాండ్ పెట్టాలనే ఆలోచన చేస్తోంది టీడీపీ.
రంగంలోకి చంద్రబాబు..! రెండురోజుల్లో కొలిక్కి రానున్న సీట్ల సర్దుబాటు..!!
పొత్తులో భాగంగా టీజేఎస్ 18 సీట్లు డిమాండ్ చేసి తగ్గేది లేదని భీష్మించుకు కూర్చుంది. ఒక వేళ టీజేఎస్ కు 18 అసెంబ్లీ స్ధానాలు కేటాయిస్తే, టీడీపీకి ఇంకో రెండు ఎక్కువ చేసి మొత్తం 20 స్ధానాలు ఇవ్వాలనే డిమాండ్ పెట్టాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్ ను ఓడించాలనే విశాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సీట్ల విషయంలో పట్టువిడుపుల ధోరణి అవలంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగి టీజేఎస్ తో కూడా మాట్లాడి మధ్యే మార్గంగా సీట్ల సర్దుబాటును ఒక కొలిక్కి తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మొత్తానికి మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీ పరువును కాపాడుకునే విధంగా తమ వాటా సీట్లను సాధించుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది.