కాశ్మీర్లో అశాంతి: 'మాట్లాడాల్సింది పార్లమెంట్లో, తెలంగాణలో కాదు'
న్యూఢిల్లీ: కాశ్మీర్లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులపై బుధవారం రాజ్యసభలో చర్చకు వచ్చింది. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆజాద్ మాట్లాడుతూ వాజుపేయికి తగ్గట్టుగా ప్రధాని మోడీ మాటలు లేవన్నారు.
ప్రధాని మోడీ కాశ్మీర్ వ్యాలీని ప్రేమించటం కాదని, అక్కడి ప్రజలను ప్రేమించాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. గత 33 రోజులుగా కాశ్మీర్లో కర్ఫ్యూ కొనసాగుతూనే ఉందని తెలిపారు. దీంతో పాటు దేశంలో జరుగుతున్న వివిధ ఘటనలపై మోడీ స్పందించిన తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు.
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులపై ప్రధాని పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. దళితుల అంశంపై ప్రధాని మోడీ తెలంగాణలో మాట్లాడతారు కానీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. అదే విధంగా కాశ్మీర్ అంశంపై ప్రధాని మధ్యప్రదేశ్లో మాట్లాడారని లోక్ సభలో కాదని పేర్కొన్నారు.
కాశ్మీర్ అంశంపై సభలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ అంశంపై సభలో ప్రధాని మాట్లాడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు గాను అన్ని పార్టీల నేతలతో కూడిన కమిటీని తీసుకెళ్తామంటూ పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఆజాద్ డిమాండ్ చేశారు.
కాశ్మీర్లోని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మిలిటెన్సీ బారిన పడిందని ఈ సందర్భంగా తెలిపారు. కాశ్మీర్లో మిలిటెన్సీ ఉండటం వల్ల పలు కుటుంబాలు తమ స్నేహితులను, బంధువులను కోల్పోయారని సభకు వివరించారు. మతోన్మాదానికి, వేర్పాటు వాదానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు.
కాశ్మీర్లో శాంతిభద్రతలు ఒక్క కాశ్మీరీ పోలీసులు చేతిలో లేవని, పారామిలిటరీ బలగాలు కూడా అందులో పాలుపంచుకున్నాయని తెలిపారు. జమ్మా & కాశ్మీర్ భారత్ భూభాగంలోనే ఉందని మీరు చెప్తున్నారు కానీ అ ఆభావన మనసులో ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి చురకలంటించారు.
భారత ప్రజలకు జమ్మూ కాశ్మీర్కు మధ్య ఆ భావాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాశ్మీర్ అంశంపై మాట్లాడిన కేంద్రం హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం కూడా ప్రయత్నిస్తోందని అన్నారు.
ఇందు కోసం అక్కడి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. కాగా గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ స్పందిస్తూ.. జమ్మా కాశ్మీర్లో సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జమ్ము కాశ్మీర్లో పరిస్థితిపై అందరూ ఏకకంఠంతో మాట్లాడాలని అన్నారు.