బాబోయ్ మళ్లీ పెరగనున్న ఎండలు.. బయటకు వెళ్తే జర భద్రం...
Recommended Video
హైదరాబాద్ : సూరీడు సుర్రుమంటున్నాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడింటి నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది దాటిందంటే బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. సూర్యుడు నడి నెత్తికొచ్చే సమయానికి బిజీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటినా వడగాలుల నుంచి ఉపశమనం లభించడం లేదు.
పెరగనున్న ఎండల తీవ్రత
తెలంగాణలో ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంటోంది. రాష్ట్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ ప్రకటించింది. ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 47 నుంచి 48 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని, వడగాలులు మరింత పెరుగుతాయని అధికారులు చెప్పారు. మే నెలాఖరు వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని అంటున్నారు.
జూన్లోనూ భానుడి భగభగలు
తెలంగాణలో కోర్ హీట్ వేవ్ జోన్లో ఉండటంతో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెప్పింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలులు జనాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. జూన్లో మొదటివారంలోనూ భానుడి భగభగలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే వర్షాకాలంలో మాత్రం పుష్కలంగా వానలు కురుస్తాయని చెప్పింది.
అవస్థలు పడుతున్న కూలీలు
ఎండల దెబ్బకు కూలీనాలీ చేసుకునే వారు నానా అవస్థలు పడుతున్నారు. మండుటెండలో పని చేయలేక నరకం అనుభవిస్తున్నారు. రైతులు, ఉపాధి హామీ కూలీలు సైతం పెరిగిన ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు. పొలాల్లో పనులు ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకుంటున్నారు. రానున్న మూడో రోజుల్లో ఎండల తీవ్రత పెరగనున్నందున ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని అధఇకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తరుచూ నీళ్లు తాగాలని చెబుతున్నారు.