కమ్మేసిన మబ్బులు: భాగ్యనగరంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాల్లో పోటెత్తిన వరద!
బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి వరదనీటితో నిండిపోయింది.
Recommended Video
హైదరాబాద్: బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి వరదనీటితో నిండిపోయింది. అర్థరాత్రి తర్వాత వర్షం జోరందుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి
రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా ఇళ్ల అంధకారంలోనే ఉండిపోయాయి. . గురువారం ఉదయం కూడా మబ్బులు కమ్ముకోవడంతో నగరమంతా చీకట్లు అలుముకున్నాయి. కుండపోత వర్షాలకు పలు కాలనీలు వరదమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి పద్మారావు స్వయంగా రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.
ఏయే ప్రాంతాల్లో:
సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.
రంగంలోకి పద్మారావు:
బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల కాలనీలు వరదనీటితో నిండిపోయాయి. మల్కాజ్ గిరి చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో మంత్రి పద్మారావు ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. మోకాళ్ల లోతు నీటిలోను ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిరాశ్రయులైన వారికి తగిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రం:
లాలాపేట చుట్టుపక్కల ఉన్న పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరడంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునరావాసం నిమిత్తం వారందరిని లాలాపేట ఫంక్షన్ హాల్ కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని అపార్ట్ మెంట్స్ లోకి వరద నీరు చేరడంతో.. కిందకు రావడం వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది.
మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు:
భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతుండటంతో పటేల్ నగర్, దుర్గానగర్లోని ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరింది. దీంతో దుర్గంధం భరించలేక స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. కాలనీవాసులు కొంతమంది ఇళ్ల పైకి ఎక్కి నిలబడుతుండటం గమనార్హం. మేడ్చల్ జిల్లా లోని నేరేడ్మెట్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బండ్లచెరువు పొంగి పొర్లుతోంది.
భారీ వర్ష సూచన:
ప్రస్తుతం హైదరాబాద్ నగరవ్యాప్తంగా మేఘావృతమై ఉండటంతో గురువారం కూడా కుండపోత వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో చెరువులు, నాలాలు, కుంటల పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఎమర్జెన్సీ టీంల కోసం 040-21111111 అనే ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, ఈఈ, సర్కిల్ కమిషనర్లు ఫీల్డ్ లో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.