వానొస్తే 'ఐటీ' ఉద్యోగులకు చుక్కలే: ఏ అర్థరాత్రో ఇంటికి, దండుకుంటున్న ఆటోవాలాలు..
శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన వర్షం 8.30 వరకు పడటంతో వర్షపు నీరు హైటెక్సిటీ పరిసరాలతోపాటు పలు ప్రాంతాలను ముంచెత్తింది.
హైదరాబాద్: వాన పడితే చాలు అదో నరకం. సరిగ్గా ఆఫీస్ నుంచి ఉద్యోగులు, స్కూల్స్ నుంచి విద్యార్థులు బయటకెళ్లిన సమయానికే వర్షం పడితే.. ఇంటికి చేరుకోవడానికి వాళ్లు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు.
వానొస్తే.. వెహి'కిల్స్': మొన్నటి వర్షానికి వేలాది కార్లు డ్యామేజ్ (ఫోటోలు)
నరక కూపం లాంటి ట్రాఫిక్ ను దాటుకుని ఇంటికెళ్లేసరికి ఏ అర్థరాత్రో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శుక్రవారం సాయంత్రం సరిగ్గా 6గం. వర్షం ప్రారంభమవడంతో ఉద్యోగులు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు.
హైదరాబాద్ అతలాకుతలం: వాన దంచికొట్టడంతో.. దుర్భరంగా జనజీవనం
స్తంభించిన ట్రాఫిక్:
వర్షం పడ్డ ప్రతీసారి రోడ్ల మీదకు వరద నీరు చేరడం.. భారీగా ట్రాఫిక్ జామ్ అవడం తరుచూ జరుగుతోంది. ట్రాఫిక్ లో చిక్కుకున్నారంటే గంటలు గడిచినా.. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. నగరం నుంచి శివారు ప్రాంతాలకు చేరుకునేవాల్సిన వారైతే.. ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకుంటున్నారు.
శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన వర్షం 8.30 వరకు పడటంతో వర్షపు నీరు హైటెక్సిటీ పరిసరాలతోపాటు పలు ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో మాదాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. హెటెక్స్ నుంచి శిల్పారామం, మాదాపూర్ ప్రాంతాలకు చేరుకునేందుకే వాహనదారులకు మూడుగంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైటెక్ సిటీ 'జామ్':
శిల్పారామం సమీపంలో రోడ్డుపై ఐదడుగుల మేర వరదనీరు నిలిచిపోయింది. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్డు, హైటెక్స్, కొండాపూర్ ప్రాంతాల్లో రెండున్నర గంటలు ట్రాఫిక్ నిలిచిపోయపింది. విప్రో, ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ ప్రాంతాల్లోను కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
సైబరాబాద్ కమిషనరేట్, కేర్ అస్పత్రి, బయోడైవర్సిటీ చౌరస్తాల్లో వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హఫీజ్పేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, బొల్లారం మార్గాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్డపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది.
క్లైమేట్ ఎప్పుడెలా ఉంటుందో?:
పగటిపూట విపరీతమైన ఎండ ఉన్నా.. అకస్మాత్తుగా వాతావరణం మారిపోతోంది. ఉన్నట్టుండి వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా అదే జరిగింది. పగలంతా ఎండ ఉన్నా.. సాయంత్రం కాగానే మేఘాలు కమ్ముకున్నాయి. దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు ఎడపతెరిలేని వాన దంచికొట్టింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల రానున్న రెండు రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.
గంటల కొద్ది ట్రాఫిక్లో, దండుకున్న ఆటోవాలాలు:
వర్షం పడితే చాలు రోడ్లన్ని ట్రాఫిక్ జామ్ అయిపోతుండటంతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ చేరుకోవడానికే నాలుగు గంటల పైన సమయం పట్టడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు చుక్కలు కనిపించాయి.
ఇక వర్షం పడ్డ ప్రతీసారి ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. ఇష్టారీతిన చార్జీలు పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. హైటెక్సిటీ నుంచి జేఎన్టీయూ తీసుకువెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ. 300 చార్జీ వసూలు చేశారు.
భరించలేని దుర్గంధం:
చాలా చోట్ల డ్రైనేజీలను తెరిచి పెట్టడం, డ్రైనేజీ వ్యర్థాలను రోడ్డు పైనే వదిలేయడంతో వర్షం పడ్డప్పుడు ఆ దుర్గంధం మరింత ఎక్కువవుతోంది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ కంపు భరించడం కష్టంగా మారింది. కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో ఉన్న అయిల్ కంపెనీలు, లెదర్ పరిశ్రమలు రసాయనాలు నాలాలోకి వదిలేయడం వల్ల ధరణినగర్, ప్రశాంత్నగర్లో తీవ్ర దుర్వాసన వ్యాపించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే కొన్ని కంపెనీలు నాలాల్లోకి వ్యర్థాలను వదులుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.