హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం, జిల్లాల్లోనూ: తెలంగాణలో మరో మూడు రోజులపాటు
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, మీర్ పేట్, హస్తినాపురంలో దాదాపు గంటపాటు భారీ వర్షం కురిసింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ఉప్పల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ ,పంజాగుట్ట, ఈసీఐఎల్, నాచారం, ఇబ్రహీంపట్నం, దిల్సుఖ్నగర్, సంతోష్ నగర్, మలక్ పేట్, అప్ఝల్గంజ్, మెహిదీపట్నం, లక్డీకపూల్, కోటి, నారాయణగూడ, అంబర్ పేట, రాంనగర్,సోమాజిగూడ, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలీ ప్రాంతంలో కూడా కుండపోత వర్షం పడింది.
పలు జిల్లాల్లోనూ..
అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, సంతోష్ నగర్, బడంగ్ పేట్,బాలాపూర్ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో భారీ వర్షం కురియడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
నైరుతి రుతుపవనాలు ఎంట్రీ..
కాగా, రాగల 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమెరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఈరోజే నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు సమాచారం. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.
Recommended Video
తెలంగాణకు మరో మూడురోజులపాటు
ఇది ఇలావుండగా, ఛత్తీస్ గఢ్ నుంచి లక్షదీవులు వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ మీదుగా దాదాపు కిలోమీటరు ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.