భారీ వర్షంతో సచివాలయంలో కూలిన చెట్లు: స్థిరంగా అల్పపీడనం
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద రెండు చెట్లు కూలాయి. దీంతో రెండు కార్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. ఓ వ్యక్తి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి, నేరేడ్మెంట్, అమీర్ పేట, ఎస్సార్ నగర్, బోరబండ, యూసుఫ్ గుడా ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్డడాయి.
హైదరాబాదులోని బంజారాహిల్స్, శ్రీనగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ముషీరాబాద్,అంబర్పేట, కాచిగూడ, క్రాస్రోడ్, మెహదీపట్నం, అసిఫ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
ఇదిలావుంటే, వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని చెప్పింది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
కాగా, ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రల్లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉంది.