వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
Recommended Video
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 18న ఇది వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు తెలగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు వరద నీరు పెరుగుతోంది.
ఇక కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో పెరిగిపోతోంది. తుంగభద్ర ఇన్ఫ్లో 2లక్షల క్యూసెక్కులకు పెరగడం, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే శ్రీశైలం రిజర్వాయర్ నిండే అవకాశముంది. ఇప్పటికే అధికారులు జలవిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఆల్మటి డ్యామ్లో 1.11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో త్వరలోనే నాగార్జున సాగర్కు నీరు వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే... 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 157 టీఎంసీల నీరు నిల్వ ఉంది.మరో 58 టీఎంసీలు వచ్చి జలాశయంలో చేరితే శ్రీశైలం రిజర్వాయర్ నిండిపోతుంది.ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్ కు 69,913 క్యూసెక్కుల నీటిని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మరో 4 వేల క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో 8 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని వదిలారు. కడెం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ 30 గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.