ప్రమాదస్థాయిలో హుస్సేన సాగర్, మరో గంట కురిస్తే..: 'రోడ్లపైకి రావొద్దు'
హైదరాబాద్: భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సాగర్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నారు.
అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాగర్ లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్, అంబేడ్కర్ నగర్, ఇందిరా పార్క్ తదితర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు మాన్సూన్ సిబ్బంది, విపత్తు నిర్వహణ అధికారులను అప్రమత్తం చేసింది. దాదాపు మంగళవారం రాత్రంతా వర్షం కురిసింది. దీంతో నాలాల ద్వారా నీరు హుస్సేన్ సాగర్కు చేరుకుంటోంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. అంతేకాదు, మరో గంట వర్షం కురిసినా సాగర్ మరింత ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు.
తప్పిన పెనుప్రమాదం: హుస్సేన్ సాగర్ వద్ద కుంగిన రోడ్డు, కేటీఆర్ ఆదేశాలు బేఖాతరు
సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీరు హుస్సేన్ సాగర్లోకి వస్తుండగా, 1500 క్యూసెక్కుల నీటిని బయటకి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ హుస్సేన్ సాగర్ పరిమితిని మించి నీరు వచ్చి చేరుతుండడంతో గాంధీనగర్, దోమల్ నగర్, అంబేద్కర్ నగర్, అరుంధతినగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, అంబర్ పటేల్ నగర్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.
సాగర్ నీటి మట్టం ఇలా..
హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.57 మీటర్లు. ఇన్ఫ్లో 4,000, ఔట్ఫ్లో 2,000 క్యూసెక్కులుగా ఉంది. గంటకు 20 సె.మీ. నీటిమట్టం పెరుగుతోంది. బేగంపేట, ప్రశాంత్నగర్ కాలనీలు నీట మునగడంతో సాగర్ నీటిని కిందకు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో చిక్కడపల్లి, నల్లకుంట నాలాల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముంది. బేగంపేట, ప్రకాశ్ నగర్, మహమ్మద్గూడ బ్రిడ్జిలు నీట మునిగాయి.
సాగర్ నీటి విడుదలతో ఇబ్బంది లేదు: జిహెచ్ఎంసి కమిషనర్
హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం కురియడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని జిహెచ్ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి బుధవారం తెలిపారు. జిహెచ్ఎంసి సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటికే వాహనదారులను, ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్ల పైకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై, కాలనీల్లో నిలిచిన నీళ్లను చాలా వరకు క్లియర్ చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగర్ నీటి విడుదలతో ప్రమాదం లేదన్నారు. దీని వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోవని చెప్పారు.
కొండచరియలు విరిగే ప్రాంతాల్లో..
నగరంలోని పురాతన భవనాల్లో ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగే ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు.
చెరువులను తలపిస్తున్న రోడ్లు
భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మియాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్.. ఇలా చాలా చోట్ల అపార్టుమెంట్లలో సెల్లార్లోకి నీరు చేరింది. మియాపూర్ చెరువుకు గండిపడింది. నీరు రోడ్ల పైనే నిలిచింది.
పోలీస్, ఆర్మీ సేవలు వినియోగించుకోవచ్చు: కేసీఆర్
లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పోలీస్, ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
భారీ వర్షాలు
హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సాగర్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నారు. నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ఉదయం, మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు బయటకు వచ్చినప్పటికీ సాయంత్రం సమయంలో పలుచోట్ల ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
రాత్రంతా వర్షం
మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే రాత్రంతా కురుస్తూనే ఉంది. ఉదయం వాతావరణం సాధరణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అరగంట పాటు వర్షం పడింది. ఆ తర్వాత తొమ్మిది గంటలకు వర్షం మొదలై పడుతూనే ఉంది. కాగా, అంతకుముందే మంత్రి కేటీఆర్ నగరంలోని రోడ్ల పైన సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితి పైన ఆయన అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. షేక్పేట, మెహదీపట్నం, టోలిచౌకీలలో ఓ మాదిరిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సోషల్ మీడియాలో ప్రచారం
మంగళవారం వర్షం పడే సూచనలున్నట్టు అధికారులు ముందస్తు సోషల్ మీడియాలో ప్రచారం కల్పించారు. దీంతో నగర వాసులు కార్యాలయాల నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. బుధ, గురువారాల్లో కూడా ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
చెరువులకు గండ్లు
మంగళవారం రాత్రంతా వర్షంతా కురవడంతో పలు చెరువులకు గండ్లు పడడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే పలు అపార్టుమెంట్లలో సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. పలు చెరువులకు గండి పడ్డాయి. వందలాది ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో వర్షపు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురుసింది.
ముంచెత్తిన వర్షం
భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. తడిసి ముద్దైన నగరంలో పలుచోట్ల ప్రజా, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల
మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు, రహదారులు జలమయమయ్యాయి. వర్షాలతో హుస్సేన సాగర్ లోకి భారీగా నీరు చేరడంతో ఎప్పటికప్పుడు నీటిని బయటికి వదులుతున్నారు.
నగరం నీటి మయం
రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల లోని సూరారం కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది.
నాలాల కబ్జాతో ఈ పరిస్థితి
అర్థరాత్రి నుంచి చాలాచోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. నాలాల కబ్జాలతోనే ఈ పరిస్థితి నెలకొందని, జీహెచ్ఎంసీ సిబ్బంది సకాలంలో స్పందించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు వర్షంపు నీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కు మంటూ గడిపారు. మరోవైపు నగరంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్ తోపాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానాగర్, సనత్ నగర్, అమీర్ పేట్, మలక్ పేట్, ఛాదర్ ఘాట్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో విరామం లేకుండా వర్షం పడింది. దీంతో నగరం నీటి కుంటలా మారింది.