హైదరాబాద్తోపాటు జిల్లాల్లో భారీ వర్షాలు: చల్లబడ్డ వాతావరణం, పిడుగుపాటుకు ముగ్గురు మృతి
హైదరాబాద్: నగరంతోపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్ గిరి, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, అల్వాల్, బోయిన్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర ప్రజలు ఈ వర్షాలతో కొంత చల్లబడ్డారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం రాత్రి చల్లటి గాలులు వీచాయి.
అకాల వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. చౌటుప్పల్ మండలం లింగోజీగూడెంలో పిడుగుపాటుకు దంపతులు కరుణాకర్ రెడ్డి(60), వీణమ్మ(50) మృతి చెందారు. వీరితోపాటు ఓ పాడిగేదె కూడా మరణించింది.
బొమ్మల రామారం మండలం మర్యాలలో పిడుగుపడి రాములు అనే వ్యక్తి మరణించాడు. పిడుగుపాటుకు ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.