హైదరాబాద్ అతలాకుతలం: వాన దంచికొట్టడంతో.. దుర్భరంగా జనజీవనం
పలు చోట్ల నడుం లోతు వరకు రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి.
Recommended Video
హైదరాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. వరద నీరు రహదారుల పైకి చేరడంతో చాలా చోట్ల రోడ్లు కుంగిపోతున్న పరిస్థితి. డ్రైనేజీలు కూడా దెబ్బతినడంతో కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరవ్యాప్తంగా 135చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారుల పరిస్థితి దుర్భరంగా మారింది. కుంగిపోయిన రోడ్లను పూడ్చడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
ఆకాశానికి చిల్లు పడిందా?:
ఆకాశానికి చిల్లు పడిందా.. అన్న తరహాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పలు చోట్ల నడుం లోతు వరకు రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి.
పలు చోట్ల 6.5సెం.మీ:
చాలా చోట్ల రహదారులు చెరువుల్ని తలపించగా.. వర్షం ధాటికి మూసీ ఉధృతి మరింత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 6.5 సెం.మీ. వర్షం కురిసినట్లు తెలుస్తోంది.ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, , కర్మన్ఘాట్, చంపాపేట, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
డ్రైనేజీ లీక్:
సికింద్రాబాద్ వారాసిగూడలో వరద నీటికి తోడు డ్రైనేజీ లీకవడంతో రహదారులపై తీవ్ర దుర్గంధం వ్యాపించింది. సింగరేణి కాలనీ, శివగంగ థియేటర్ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ఆనంద్ బాగ్, షిర్డీనగర్ కాలనీల్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది.
పోటెత్తిన వరద:
అమీర్పేట, మైత్రివనం, మియాపూర్ దీప్తిశ్రీనగర్, నాగోల్ ప్రాంతాల్లో మోకాలి లోతు వరద నీరు ముంచెత్తింది. నాగోల్ ప్రాంతంలో మూసీలోకి వరద నీరు పోయే మార్గం లేకపోవడంతో రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది.
విజయవాడ హైవేపై ఉన్న వనస్థలిపురం రహదారిపై అడుగులోతు వరద చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్పల్లి, అల్విన్ కాలనీల్లో రోడ్లకు మరమ్మత్తులు జరుగుతున్నాయి.