వర్షాలతో తెగిన రోడ్లు, నెల్లూరులో సముద్రం ముందుకు, ప్రకాశం బ్యారేజీ 20 గేట్లు ఎత్తివేత
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి, పర్ల కోట నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
పాములగౌతం, వహిని గంగా నదులు కూడా బాగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచాయి.మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని 16 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ధర్మపురిలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వెల్గటూరు-జగదేవుపేట, దమ్మన్నపేట-రాజారాం మధ్యలో వాగు పొంగిన కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రాజారాం, దమ్మన్నపేట గ్రామాల మధ్య బీట్ రోడ్డు కొట్టుకుపోయింది. ధర్మపురి మండలంలోని పలు గ్రామాల్లో పంట నీట మునిగింది.
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ముఖ్రకే వాగు పొంగి పొరలి రాకపోకలు నిలిచాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698 అడుగులకై పైగా ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం వద్ద పెద్ద వాగు పొంగిపొర్లింది. దీంతో ఆశ్రమ, గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకు కూలి కొట్టుకుపోయింది. రెండువేల మంది విద్యార్థులు తాగినీటికి ఇబ్బందులు పడుతున్నారు.
నెల్లూరు జిల్లాలో ముందుకు వచ్చిన సముద్రం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరంలో అలల బలంగా వీస్తున్నాయి. రెండు నుంచి మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. తుమ్మలపెంట, మైపాడు, తూపిలిపాలెం తీరంలో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
ప్రకాశం బ్యారేజీ 20 గేట్ల ద్వారా నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇరవై గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం ముప్పై గేట్లు ఎత్తివేసే అవకాశముంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.