హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు, రెడ్ అలర్ట్: కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆదివారం రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

 Heavy Rains: Telangana CS teleconference with collectors on rains

వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు.

జల దిగ్భంధంలో వన దుర్గా భవానీ ఆలయం

భారీ వర్షాలు, వరదలతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మధ్యతరహా ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది గుడిని మూసివేశారు. ఆలయం వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి శాఖ అధికారులు సూచించారు. భక్తుల దర్శనార్థం రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

English summary
Heavy Rains: Telangana CS teleconference with collectors on rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X