Rain alert: తెలంగాణలో మరో మూడురోజులపాటు అతి భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో
హైదరాబాద్: తెలంగాణలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారానికి అది మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయన్నారు.
అతి భారీ వర్షాలు.. తెలంగాణ రెడ్ అలర్ట్
ఈ నేపథ్యంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించారు. మరికొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
భారత వాతావరణ శాఖ తాజా సూచన ప్రకారం... ఆగస్టు 7న, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Recommended Video
ఇప్పటికే పలు జిల్లాలో అతి భారీ వర్షాలు
శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాల్లోని అక్కెనపల్లి, పాత మంచిర్యాలలో 9.2, వంకులం(కుమురంభీం)లో 7.3, అర్నకొండ(కరీంనగర్)లో 6.1, కారేపల్లి(ఖమ్మం)లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో చల్లని వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.