మాదాపూర్ టు సికింద్రాబాద్: 13 కి.మీ. మేర భారీ ట్రాఫిక్ జామ్, ఇక్కట్లు
హైదరాబాద్: హైదరాబాదులో పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ ఎక్కడికి అక్కడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు చాలాసేపు రహదారుల పైనే నిలిచిపోయారు. వాహనాలను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు గంటలకొద్ది కష్టపడ్డారు.
మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు 13 కిలో మీటర్ల మేర ఎక్కడికి అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్, చెక్ పోస్ట్, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ నిలిచింది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్ మార్గంలోను ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు సాయంత్రం ఏడు గంటల సమయంలో ట్రాఫిక్ జామ్ అయింది.
గ్రీన్ ల్యాండ్స్ బ్రిడ్జి పైన రెండు వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ - సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సమయం పడుతుందని చెప్పారు.
ట్రాఫిక్ జామ్ అంశంపై సీపీ అంజనీకుమార్ స్పందించారు. ట్రాఫిక్ జాం పైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ అదనపు సీపీ స్వయంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవర్ పైన వాహనాలను తొలగించామని చెప్పారు. రోడ్డు నెంబర్ 1/10, 1/12లో బ్రేక్ డౌన్ అయిన బస్సులను తొలగిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ కాసేపట్లో క్లియర్ అవుతుందన్నారు.