విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ...టోల్ పన్నులు రద్దు చెయ్యాలంటూ పంతంగి టోల్ ప్లాజాపై దాడి
ఏపీలో ఎన్నికల పండుగకు పయనమయ్యారు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా నివాసం ఉంటున్న , పని చేస్తున్న లక్షలమంది ప్రజలు. ఎన్నికల నేపథ్యంలో ఓటువేయడానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణీకులు ట్రాఫిక్ జామ్ లతో పడరాని పాట్లు పడుతున్నారు .రైళ్ళు, బస్సులు, కార్లు ఒకటేమిటి అన్ని వాహనాలతో రహదారులు క్రిక్కిరిసిపోయాయి. ఎన్నడూ లేని విధంగా ఓటరు చైతన్యం అంతా రహదారుల మీద బారుల తీరిన వాహనాలలో కనిపిస్తుంది.
ఓటెయ్యండి .. మీ పిల్లల ఫైనల్ పరీక్షల్లో 10 మార్కులు బోనస్ గా కలుపుతాం
తెలంగాణా నుండి ఏపీకి ఎన్నికల పండుగకు వెళ్తున్న లక్షలమంది ప్రజలు
ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే విజయవాడ హైవే మీదట్రాఫిక్ జామ్అయ్యేది. ఇప్పుడు ఎన్నికల పండుగకు కూడా అదే పరిస్థితి . ట్రాఫిక్ జామ్ లను ఊహించి ముందే కొంత మంది మంగళవారం సాయంత్రమే పెట్టె బేడా సర్దుకుని ప్రయాణం ప్రారంభించారు. అయినా సరే ఒక్కసారే దాదాపు 10 లక్షలమంది ఏపీకి ఓటు వెయ్యటానికి వెళ్తున్న నేపధ్యంలో ట్రాఫిక్ జామ్ లు ప్రయాణికులకు తలనొప్పిగా మారాయి. ఏపీవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే, ఈ వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది .
పతంగి టోల్ ప్లాజా దగ్గర విపరీతమైన ట్రాఫిక్ జామ్
నిన్న రాత్రి బయలుదేరినవారు ఇప్పటికీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారంటే అతిశయోక్తి కాదు . దీంతో బుధవారం ఉదయం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామైంది. ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దఎత్తున లక్షల మంది ఒక్కసారిగా ఏపీ బాట పట్టటంతో టోల్ పన్ను కోసం వాహనాలను ఆపుతున్న క్రమంలోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేరలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు . రహదారులు ఎక్కడ చూసినా వాహనాల బారులతో దర్శనం ఇస్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద విపరీతం అయిన రద్దీ నెలకొన్న నేపధ్యంలో తొమ్మిది కౌంటర్లను తెరిచినా వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు .
నిన్న సాయంత్రమే బయలుదేరినా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఓటర్లు
ట్రాఫిక్ జామ్ లను ముందే ఊహించి నిన్న సాయంత్రమే ప్రయాణం ప్రారంభించినా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఓటర్లు విపరీతంగా ఉన్న ట్రాఫిక్ నేపధ్యంలో అయినా టోల్ పన్ను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పంతంగి వద్ద నెలకొన్న ట్రాఫిక్ జామ్ క్లియర్ చెయ్యటానికి అయినా టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని టోల్ ప్లాజా నిర్వాహకులతో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. సహనం నశించిన కొందరు టోల్ ప్లాజా గేట్లపై దాడిచేసి, ధ్వంసం చేశారు.
పంతంగి టోల్ ప్లాజాపై దాడి చేసిన ప్రయాణికులు .. టోల్ పన్ను రద్దుకు డిమాండ్
గంటల కొద్దీ వేచి ఉండటంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ఒక్కసారిగా గేట్లను ధ్వంసం చేయడంతో, సిబ్బంది చేతులెత్తేశారు . వారిని అడ్డుకోలేని పరిస్థితిలో వాహనాలను వదిలేశారు . టోల్ ప్లాజా వద్ద అన్ని గేట్లూ ధ్వంసం కావడంతో ప్రస్తుతం వాహనాలను పంపుతున్నారు. . దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రయాణీకులకు నచ్చజెబుతున్నారు. అన్ని వాహనాలనూ పంపించిన తరువాత గేట్లను పునరుద్ధరిస్తామని వారు వెల్లడించారు. ఇక ఇక్కడే కాకుండా పలు చోట్ల ఉన్న టోల్ ప్లాజాలవద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఆపటానికి టోల్ పన్ను లేకుండా రద్దు చెయ్యాలని కోరుతున్నారు లక్షలమంది ఓటర్లు .