పోలీసుల్నీ వదలడం లేదు: హైదరాబాద్లో హెల్మెట్ మినహాయింపు వీరికే?
హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పుతో హైదరాబాద్ నగరంలో హెల్మెట్ నిబంధనను పోలీసులు తప్పనిసరి చేశారు. ఇప్పటి వరకు హెల్మెట్ ధరించకుండా తమ వాహనాలను నడిపిన ప్రజలు ఒక్కసారిగా హెల్మెట్ నిబంధన అమల్లోకి రావడంతో సతమతమవుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టం లేని వారు మాత్రం జరిమానాలు కడుతూనే ఉన్నారు.
మార్చి ఒకటో తేదీ నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క మంగళవారమే నగరంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 32 మంది పోలీసులకు ట్రాఫిక్ సిబ్బంది జరిమానా విధించారు. వీరిలో వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు.
అదే విధంగా హెల్మెట్లు లేని 20 మంది న్యాయవాదులకు కూడా జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే పోలీసులకు కూడా జరిమానా విధించనున్నారు. ఓ పోలీసు ఇలా మూడుసార్లు పట్టుబడితే విధుల నుంచి సస్పెండ్ చేయనున్నారు. ఈమేరకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే ప్రజలపై రూ. 100 జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు... సివిల్ పోలీసులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాగా నగరంలో తాజాగా ప్రవేశపెట్టిన హెల్మెట్ నిబంధన మీకు తలనొప్పిగా పరిణమించిందా? ధరించేందుకు మీ శరీరం సహకరించటం లేదా? హెల్మెట్ లేకుండా బయటకు వస్తే, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారా? అలాంటి వారికి ఇది శుభవార్తే.
స్పాండిలైటిస్, సొరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి హెల్మెట్ నుంచి మినహాయింపును ఇచ్చే అంశాన్ని వాహనచట్టం సెక్షన్ 129 ప్రకారం ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇందుకుగాను ట్రాఫిక్ పోలీసుల తనిఖీ సమయంలో సదరు వ్యక్తులు వైద్యుల సిఫారసు చేసిన ఒరిజినల్ లెటర్ను చూపించాల్సి ఉంటుంది.
ఈ లేఖను ట్రాఫిక్ కంట్రోల్రూంలో నమోదు చేయిస్తే, వీరికి మినహాయింపునిస్తూ డేటాలో ఎంట్రీ చేసే అంశాన్ని ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మెడనొప్పి ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మినహాయింపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.