ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్.. ఆ ఫోటోలు పంపమన్నాడు.. ఆమె నాన్నను బ్లాక్ మెయిల్ చేశాడు
హైదరాబాద్ : సోషల్ మీడియాను తమ కేంద్రంగా చేసుకొని కొందరు రెచ్చిపోతున్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమై ... హాయ్, బై చెపుతూ మాటలు కలుపుతున్నారు. వారిని ఎలాగోలా బుట్టలో పడేసి .. లక్షలు గుంజుతున్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా .. కళ్ల ముందే బాధితులు మోసపోతున్నా .. మిగతా అమ్మాయిలు మాత్రం మారడం లేదు. ఫేస్బుక్ వలలో పడి యధేచ్చగా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఓ బాలిక మోసపోయింది. ఫోటోల పేరుతో బ్లాక్ మెయిల్ చేయడంతో లక్షలు ఇచ్చింది.
మోసం .. నయవంచన
హైదరాబాద్లో ఓ మైనర్ బాలిక కూడా అలాగే మోసపోయింది. ఆమె తండ్రి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సమాజంలో పేరు, గౌరవం, మర్యాదతోపాటు డబ్బులు కూడా ఉన్నాయి. అయితే అతనికి ఓ కూతురు ఉంది. కానీ ఆమెకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చి తప్పుచేశారు. దాంతో ఆమె సోషల్ మీడియా వేదికగా మోసపోయారు. ఫేస్బుక్లో ఆమెకు హేమంత్ సాయి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతని స్వస్థలం రాజమండ్రి .. వీరి మధ్య మాట మాట కలిసింది. ఇంకేముంది ఫ్రెండ్షిప్ అన్నారు. తర్వాత ప్రేమగా మారింది. పలుమార్లు కలుసుకున్నారు కూడా. అయితే ఆ అమ్మాయి హేమంత్ సాయి, అతనితో ఫోటోలు దిగింది. ఇదే ఆమె చేసిన పెద్ద పొరపాటు. అంతేకాదు ఆ ఫోటోలు హేమంత్కు పంపించి చేజేతులా కష్టాన్ని కొనితెచ్చుకుంది.
ఫోటోలతో బ్లాక్ మెయిల్
అదను కోసం చూసిన హేమంత్ అనే కసాయి ఫోటోల పేరుతో బ్లాక్ మెయిల్ చేశాడు. అమ్మ నాన్నలకు చూపిస్తానని బెదిరించాడు. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భయపడింది. అడిగినప్పుడల్లా డబ్బు ముట్టజెప్పింది. అలా దాదాపు రూ. 11 లక్షలు ఇచ్చింది. అయినా హేమంత్లో ఎక్కడో అసంతృప్తి .. ఇంకా డబ్బు కావాలనుకున్నాడు. బాలిక అంతమొత్తంలో ఇవ్వలేదని భావించాడు. ఇంకేముంది ప్రొఫెసర్ను లైన్లో తీసుకున్నాడు. కూతురికి సంబంధించిన ఫోటోలు పంపి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హేమంత్ బ్లాక్ మెయిల్ గురించి ప్రొఫెసర్ సైబరాబాద్ పీఎస్లో కంప్లైంట్ చేశారు. ఇంకేముంది ఫోన్ సిగ్నల్ ఆధారంగా హేమంత్ అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వద్దని చెబుతున్నా ..
ఫేస్ బుక్లో ఫేక్ ఫ్రెండ్సిప్ చేయొద్దని మేధావులు కోరుతన్నా యువత మారడం లేదు. స్నేహం పేరుతో నమ్మి నట్టేట మునుగుతున్నారు. కసాయిలను నమ్మి పరువు పొగొట్టుకుంటున్నారు. మరికొందరు డబ్బులు కొల్పోయి మోసపోయామని మెల్లగా గ్రహిస్తున్నారు. తర్వాత తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా వేదికగా స్నేహాలు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.